హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): పశ్చిమబెంగాల్ గడ్డపై తెలంగాణ విద్యార్థులు నిర్వహించిన బతుకమ్మ, పీరీలు, బోనాలు వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో పురులియాలోని జగన్నాథ కిశోర్ కళాశాలలో నిర్వహించిన జాతీయ సమైక్యత శిబిరానికి దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల నుంచి 21 బృందాలు హాజరుకాగా.. తెలంగాణ నుంచి శాతవాహన వర్సిటీ ఎంపికయ్యింది. స్వచ్ఛ భారతదేశం- హరిత భారతదేశం నినాదంతో నిర్వహిస్తున్న ఈ క్యాంపులో తెలంగాణ విద్యార్థుల ప్రదర్శనకు ప్రశంసలు దక్కినట్టు శాతవాహన వర్సిటీ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ కే శ్రీవాణి తెలిపారు. విద్యార్థులను వీసీ ప్రొఫెసర్ ఎస్ మల్లేశ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం వరప్రసాద్, ఓఎస్డీ వీ రమేశ్ అభినందించినట్టు ఆమె పేర్కొన్నారు.