హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, ప్రజాసంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయించేందుకు ప్రత్యేక ఉద్యమాన్ని నిర్వహించాలని వివిధ రాష్ర్టాలకు చెందిన 30కిపైగా రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఉద్యమం కోసం 50 లక్షల మంది రైతులతో కార్యాచరణ రూపొందించాలని, అన్ని రాష్ర్టాల రైతులను సమన్వయం చేసేందుకు మొబైల్ యాప్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, కల్యాణలక్ష్మి, కేసీఆర్కిట్లు, ఆసరా పింఛన్లలాంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ప్రశంసించారు. వీటి అమలుకు అన్ని రాష్ర్టాల సీఎంలకు వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్కు విజ్ఞప్తిచేసిన రైతు సంఘాల నేతలు.. తాజాగా కర్ణాటక సీఎం బొమ్మైకి వినతిపత్రం అందజేశారు. త్వరలో కేరళ, మహారాష్ట్ర సీఎంలను కలవనున్నట్టు తెలిపారు. సమావేశంలో జాతీయ పసుపు రైతు సంఘం ఉపాధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు, కర్ణాటక రైతు సంఘాల అధ్యక్షుడు శాంతకుమార్, బసవరాజ్, రైతు నేతలు వినయ్రావు, వీరన్నగౌడ్, సరేశ్ పాటిల్, నల్లమల వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.