కరోనా కథ ఇక ముగిసిందేమోనని అందరూ సంబరపడుతున్న వేళ వైరస్ మరో రూపంలో కొత్త అవతారమెత్తింది. మరిన్ని పరివర్తనలు చెంది దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్గా మారి విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నగర వైద్యులు కూడా జాగ్రత్తలు సూచిస్తున్నారు. రెండు డోసుల టీకా తీసుకున్నా ఈ కొత్త వైరస్ సోకే ప్రమాదం ఉన్నట్లు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయితే ఈ వేరియంట్ రాష్ట్రంలో అడుగుపెట్టనప్పటికీ ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వైరస్ ఉనికి లేదని కొందరు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. ఇది తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ స్థాయి కూడా అధికంగా ఉన్నందున మాస్కులను తీయొద్దని పదే పదే చెబుతున్నారు. మొదటి, రెండో వేవ్లలో తీసుకున్న జాగ్రత్తలనే మళ్లీ అనుసరిస్తే వందశాతం క్షేమంగా ఉండగలమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : కరోనా కొత్త వేరియంట్ను అంత తేలికగా తీసుకోవద్దంటున్నారు వైద్యనిపుణులు. వైరస్ విషయంలో ఆదమరిస్తే ఆగమే అని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్రికా, యూకేతో పాటు పలు దేశాలను వణికిస్తున్న ‘ఒమిక్రాన్’ కొత్త వేరియంట్ డెల్టా కంటే వేగంగా విస్తరించే గుణమున్నట్లు వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు ఈ కొత్త వేరియంట్ ఆందోళన కలిగిస్తుంది. ‘ఒమిక్రాన్’ ఆర్నాట్ విలువను పరిశీలిస్తే ఇది మిజిల్స్ వైరస్ కంటే అధికంగా ఉన్నట్లు వైద్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ఈ వేరియంట్ గాలి ద్వారా కూడా వ్యాపించే అవకాశాలు ఉండవచ్చని వైద్య శాస్త్రవేత్తల అంచనా.
అంతే కాకుండా ఒమిక్రాన్ ‘విరులెన్స్'(ఇన్ఫెక్షన్ స్థాయి) కూడా అధికంగా ఉందంటున్నారు వైద్యశాస్త్రవేత్తలు. ఇది రోగ నిరోధక శక్తిని కూడా అధిగమించే శక్తిని కలిగి ఉన్నట్లు వైద్యశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రెండు డోసుల టీకా వేసుకున్న వారికి కూడా వైరస్ సోకే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నట్లు వారు హెచ్చరిస్తున్నారు. కొత్త వేరియంట్ మన దేశంలో ఇప్పటి వరకు వచ్చిన దాఖలాలైతే కనిపించడం లేదు. అయిన్పటికీ సెకండ్ వేవ్ అనుభవాల దృష్ట్యా కొత్త వేరియంట్ విషయంలో అప్రమత్తంగానే ఉండాలంటున్నారు వైద్యులు. తెలంగాణలో వైరస్ ఉనికి పెద్దగా లేకపోవడంతో ఈ మధ్యకాలంలో ప్రజలు కరోనా నియమాలను క్రమంగా విస్మరిస్తున్నారు. ఇది తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశాలు లేకపోలేదని, కొత్త వేరియంట్ను దృష్టిలో పెట్టుకుని కరోనా జాగ్రతలు తప్పనిసరిగా పాటించాలంటున్నారు వైద్యులు.
ఇతర దేశాల నుంచి హైదరాబాద్ వచ్చేందుకు విమాన ప్రయాణం చేయాలంటే 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అంతేకాకుండా దక్షిణాఫ్రికాతో పాటు ఒమిక్రాన్ ప్రభావిత 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులు తప్పనిసరిగా 7 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లో ఉండాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు శంషాబాద్ విమానాశ్రయంలో పలు ఆంక్షలు విధించినట్లు రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, బోట్సువానా, ఇజ్రాయెల్, హాంకాంగ్, బెల్జియం తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన రెండు ప్రత్యేక స్క్రీనింగ్ సెంటర్లలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
ఈ పరీక్షల్లో నెగిటివవ్ వచ్చిన ప్రయాణీకులు 7 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ ఉండాలని, 8వ రోజు మరోసారి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ స్వరాజ్యలక్ష్మి తెలిపారు. విమానాశ్రయంలో లేదా హోమ్ ఐసోలేషన్ తరువాత జరిపిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ వస్తే వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలకు పంపి, రోగులను ప్రత్యేక ఐసోలేషన్కు తరలించి చికిత్స అందిస్తామని వివరించారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎవరికీ పాజిటివ్ వచ్చిన దాఖలాలు లేవని డాక్టర్ స్వరాజ్యలక్ష్మి స్పష్టం చేశారు.
ఖచ్చితమైన అభిప్రాయానికి రాలేం..
కొత్త వేరియంట్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆఫ్రికా, యూకే దేశాలలో పాజిటివ్కు గురవుతున్న వారిలో 80శాతం మంది వ్యాక్సిన్ తీసుకోని వారే ఉంటున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి వైరస్ సోకినా వారిలో లక్షణాలు పెద్దగా కనిపించడం లేదని తెలుస్తోంది. కొత్త వేరియంట్ సోకిన రోగులు హస్పిటలైజేషన్, ఐసీయూ వరకు వెళ్లడం పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇది ప్రారంభ దశ అయినందున దీనిపై ఖచ్చితమైన అభిప్రాయానికి రాలేం. వైరస్ తీవ్రతను అంచనా వేయాలంటే మరో రెండు మూడు వారాలు వెయిట్ చేయాలి.
ఈ వేరియంట్ ప్రభావం పిల్లల్లో కూడా కనిపించిన దాఖలాలు పెద్దగా లేవు. మరో శుభ పరిణామమేంటంటే ఇపుడొస్తున్న కొత్త వేరియంట్ను నిర్ధారించేందుకు పీసీఆర్ టెస్టులే సరిపోవడం. అంటే పీసీఆర్కు సంబంధించిన పాత కిట్లతోనే ‘ఒమిక్రాన్’ను గుర్తించగలుగుతున్నారు. అయితే కొత్త వేరియంట్ ఆర్నాట్ విలువ 24గా నమోదైంది. అంటే ఇది మిజిల్స్(చిన్న అమ్మవారు)వైరస్ కంటే అధికం. మిజిల్స్ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. అర్నాట్ విలువ అధికంగా ఉన్న కొత్త వేరియంట్కు కూడా ఆదే గుణం ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే ఇది డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని వైద్య శాస్త్రవేతలు హెచ్చరిస్తున్నారు.
కొత్త వేరియంట్కు సంబంధించి ఖచ్చితమైన సమాచారం లేదు. ఆఫ్రికా, యూకే దేశాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వై రస్ వేగంగా వ్యాపిస్తుందంటున్నారు. దీని ప్రభావం మనపై ఎలా ఉంటుందో అంచ నా వేయడానికి కొంత సమ యం పట్టవచ్చు. ఆఫ్రికా దేశంలో హెచ్ఐవీ బాధితులు అధికం. వారికి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉండడం వల్ల వారిపై వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే అవకాశాలు సహజం. అక్కడున్నంత తీవ్రత మన దేశంలో ఉండకపోవచ్చు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ దాని తీవ్రత తక్కువగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎర్లీ స్టేజ్ కావడంతో ఖచ్చితమైన సమాచారం కోసం మరికొన్న రోజులు ఆగాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన దగ్గరైతే వైరస్ ఉనికి చాలా చాలా తగ్గింది. అదే స్థాయిలో ప్రజల్లో నిర్లక్ష్యం కూడా పెరిగిపోయింది. ఇది మంచిదికాదు.- డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ హాస్పిటల్
గత వేరియంట్ల కంటే ఒమిక్రాన్ వేరియంట్ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే వైరస్ తీవ్రత, మోర్టాలిటీపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. దీనికి కొంత సమయం పట్టవచ్చు. రెండు డోసులు వేసుకున్న వారిలో వైరస్ తీవ్రత పెద్దగా కనిపించడం లేదు. గతంలో ఉన్నట్లు ఐసీయూ, హాస్పిటలైజేషన్ పరిస్థితులు పెద్దగా లేవు. మరణాల రేటుపై స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి.
కరోనా వైరస్లోని కొమ్ముల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. కొమ్ముల సంఖ్య పెరిగినట్లు తెలుస్తుంది. దీని వల్ల వైరస్ విరులెన్స్ పెరిగింది. అంటే ఒమిక్రాన్ వేరియంట్లో ఇన్ఫెక్షన్ తీవ్రత పెరిగింది. అందుకే ఇది రోగ నిరోధక శక్తిని తట్టుకుని మనుషులపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. కొత్త వేరియంట్ స్వభావంపై పూర్తిస్థాయి స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుంది. – డాక్టర్ రఘురామ్రావు, ఫార్మకాలజీ శాస్త్రవేత్త