ముషీరాబాద్, జనవరి 7: ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి, దళితులను నట్టేట ముంచుతున్న బీజేపీకి ఓటుతోనే తగిన బుద్ధి చెప్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్, మేడి పాపయ్య పేర్కొన్నారు. శుక్రవారం విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న బీజేపీ ఏడేండ్లయినా చేయలేదని విమర్శించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో దళితులపై దాడులు, అత్యాచారాలు అధికమయ్యాయని ఆరోపించారు. దళిత పరిశోధక విద్యార్థులకు ఫెలోషిప్లు రాకుండా చేస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సమావేశంలో కోర్ కమిటీ సభ్యులు శంకరన్న, మీసాల మల్లేశ్, చిలకమర్తి గణేశ్, యాదగిరి, బాబన్న, నర్సింహ, రుక్కమ్మ, పొట్టపెంజర రమేశ్, కొల్లూరి వెంకట్ పాల్గొన్నారు.