దక్షిణ భారతంలో పాదుకొనటానికి బీజేపీ పడరాని పాట్లు పడుతున్నది. అందు కోసమే ఎవరినైనా అక్కున చేర్చుకొని ఆ పార్టీ చేరదీస్తున్నది. ఎలాగైనా బలం పెంచుకోవటానికి తంటాలు పడుతున్నది. కానీ తెలంగాణలో బీజేపీ అంటే పరాయి పార్టీ. హిందుత్వాన్ని బలవంతంగా రుద్దే పార్టీగా మత ఘర్షణలు సృష్టించే పార్టీగా ఇప్పటికే అప్రతిష్టను మూటగట్టుకున్నది. సెక్యులరిజం అంటే నే గిట్టని పార్టీగా పేరుండటం వల్ల టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందు కు చేస్తున్న ప్రయత్నాలేవీ పనిచేయవు. తెలంగాణ విభజన సిద్ధాంతాలకు అనువైన రాష్ట్రం కాదనేది అందరికి తెలిసిందే.
ఉమ్మడి పాలనలో దశాబ్దాల తరబడి తెలంగాణ ప్రజలు దుర్భర జీవితాలు గడిపారు. కాబట్టి మళ్లీ అలాంటి గడ్డు పరిస్థితులను అనుభవించాలని తెలంగాణ ప్రజలు ఏనాడూ కోరుకోరు. తెలంగాణలో ఉన్న శాంతియుత వాతావరణంలో మతాల పేరిట తగాదాలు సృష్టించి, తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ కంటున్న కలలు కల్లలవుతాయి. మొన్న నాలుగు ఎంపీ సీట్లు, నిన్న దుబ్బాక, నేడు హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు పునరావృతం చేయాలనే ఆదుర్తాతో ఒంటె పెదవులకు నక్క ఆశపడ్డ చందాన వ్యవహరిస్తున్నది.
రాష్ట్రంలో హిందూ, ముస్లింల మధ్య అగాధం సృష్టించి, లాభం పొందేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతున్నది. ప్రత్యామ్నాయంగా ఎదుగాలనే కోరిక ఉండటం బాగానే ఉంది కానీ, చొచ్చుకపోవాలనే మతోన్మాద మొరటు వ్యూహం తెలంగాణలో పనిచేయదు. గంగా జమునా తెహజీబ్గా అన్ని మత విశ్వాసాల ప్రజలు కలిసి మెలిసి జీవిస్తున్న తెలంగాణలో బీజేపీ వ్యూహం బెడిసికొట్టక మానదు.
హుజూరాబాద్ గెలుపుతో బీజేపీ 2023 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈటలను స్టార్ క్యాంపనీర్గా వాడుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఏం చేసినా బీజేపీకీ మూడు ఆరవుతాయేమో కానీ 60 అయితే కావు కదా? రాష్ట్ర ఎన్నికల్లో స్థానిక అంశాలకే ప్రాధాన్యం ఉంటుంది. మరో వైపు కేంద్రంలో బీజేపీ ఒరగబెట్టిందేమీ లేదు. మున్నెన్నడూ లేని స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ ప్రజా ఆస్తులను ప్రైవేటుపరం చేస్తున్నది.
బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, సింగరేణి, రైల్వే లాంటి సంస్థలను ప్రైవేటుపరం చేస్తే యువతకు ఏ రకంగా మేలు జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి. కల్పవృక్షంలా లక్షల ఉద్యోగ అవకాశాలిచ్చి జీవం పోసి, లాభాల బాటలో నడుస్తున్న సంస్థలను ప్రైవేటీకరించాలనే ఆలోచన జాతి వ్యతిరేకమైనది. అత్యంత ప్రమాదకరమైనది. హిందుత్వం పేరుతో రగిలించే మతాల ఉచ్చులో అభ్యుదయ వాదులైన తెలంగాణ ప్రజలు చిక్కరనేది నిర్వివాదాంశం.
గత ఏడేండ్ల నుంచి బీజేపీ రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. రైతు ప్రయోజనాలను కార్పొరేట్లకు అప్పచెప్తున్నది. స్వార్థంతో గల్లిలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నది. లౌకిక రాజ్యమని ప్రకటించుకున్న దేశంలో మత ప్రతిపాదికన విభజన తెస్తున్నది. తద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలతో అధికారం చేపట్టి అదే తనదారంటూ దూసుకు వస్తున్నది. ఇలాంటి ప్రయత్నాలను దక్షిణాదిన ముఖ్యంగా చైతన్యానికి మారు పేరైన తెలంగాణ ప్రజలు తిప్పికొట్టక మానరు.
ఉత్తరాదిన మౌలిక రాజకీయ స్వరూపం ఎలా ఉన్నా, దక్షిణ భారత రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. అందులో తెలంగాణ రాజకీయ స్వరూపం విభిన్నం. ఇక్కడ ఉద్యమస్ఫూర్తి, రాజకీయ చైతన్యం ఎక్కువ. ఈ చైతన్య పునాదుల్లోంచే సీమాంధ్ర వలసపాలకుల వివక్ష, అణచివేతలకు వ్యతిరేకంగా రాష్ట్రసాధన ఉద్య మం ఊపిరిపోసుకున్నది. సుదీర్ఘ పోరాటాలూ అనన్య త్యాగాలతో రాష్ర్టాన్ని సాధించుకున్నది.
మతతత్వాన్ని మొదటినుంచి తెలంగాణ వ్యతిరేకిస్తూనే ఉన్నది. ఇక్కడ అంబేద్కర్, ఫూలే ఆలోచనాతత్త్వం దళిత, బహుజన, మైనారిటీ స్పృహ కూడా ఎక్కువే. దళిత, బహుజనులను ద్వితీయశ్రేణి పౌరులుగా చూసే పార్టీలను గుర్తిం చి ఆయుధం లాంటి ఓటు ద్వారా తరిమికొట్టే చైతన్యం కలిగి ఉంటారు తెలంగాణ ప్రజలు. అలాగే పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఒక్కొక్కటిగా ఆవిష్కరించబడుతున్నాయి. కేసీఆర్ తనదైన మార్క్ తో అభివృద్ధి సంక్షేమాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచారు.
సాగునీరు కోసం కాళేశ్వరం ప్రాజెక్టు, తాగునీటి కోసం మిషన్ భగీరథతో తెలంగాణ వ్యవసాయరంగ స్వరూపమే మారిపోయింది. రైతు బంధు మొదలు దళిత బంధు దాకా వినూత్న సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ఆత్మగౌర వం, అభివృద్ధి కోసం కొట్లాడే పార్టీ టీఆర్ఎస్ అనేది తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న ది. ప్రజలకు స్వీయపాలనా అనుభవాలను చవిచూపిస్తున్న టీఆర్ఎస్ కాదని మరో శక్తి తెలంగాణలో కాలుమోపటం కల్ల. ఈ నేపథ్యంలో బీజేపీ ఆశలు అడియాసలు కాక మానవు. (వ్యాసకర్త: జర్నలిజం విభాగాధిపతి, కేయూ)