హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కేసులు పెరిగితే రోగులకు సరిపడా ఆస్పత్రులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. గాంధీ ఆస్పత్రి కొవిడ్ వార్డుల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
‘పీపీఈ కిట్లు, మాస్క్లు, ఔషధాలు అందుబాటులో ఉంచాలి. ఇప్పటికే రోజుకు 50వేల కరోనా పరీక్షలు చేస్తున్నాం. కొవిడ్ పరీక్షల సంఖ్యను మరింత పెంచాలి. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ పకడ్బందీగా జరగాలి. కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దు.’ అని మంత్రి పేర్కొన్నారు.