హైదరాబాద్, జనవరి 17 : కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలు చేపట్టాలని, కొవిడ్ నిర్ధారణ పరీక్షలను మరింత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్కు సంబంధించిన ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ అభినంద్కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. గతంలో తామిచ్చిన ఉత్తర్వుల అమలుపై పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలని స్పష్టంచేసింది. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు జరిగేలా చూడాలని, వైద్యశాలల్లో మౌలిక వసతులను పెంచడంతోపాటు మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని సూచించింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ టెస్ట్లు చేస్తున్నామని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నెల 30 వరకు ప్రత్యక్ష తరగతులను నిర్వహించొద్దని ఉత్తర్వులు జారీచేసిందని వివరించారు. దీంతో తదుపరి విచారణను 25కు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.