ఖలీల్వాడి: తెలంగాణలో ఉద్యమకారులను గుర్తించి గౌరవిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర కన్వీనర్ మాసన గణేశ్ అన్నారు. తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ పోరాట పటిమకు తగిన గౌరవం దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని చెప్పారు.
అణగారిన జాతులకు లక్షల ఎకరాల భూమి పంచి తెలంగాణ తెగువను చాటి, నిరుపేద గుండెల్లో నిలిచిన తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ అని పేర్కొన్నారు. ఐలమ్మజయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ప్రకటించడంతో సీఎం కేసీఆర్ చిత్రపటానికి నగరంలోని వినాయక్నగర్లోని ఐలమ్మ విగ్రహం వద్ద క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇంతకు ముందే ఐదవ తరగతి పాఠ్య పుస్తకాల్లో ఐలమ్మ జీవితం గూర్చి పొందుపరిచారని, ఇప్పుడు ఆమె జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తామనడం పట్ల తెలంగాణ రజక సంఘాల సమితి హర్షం వ్యక్తం చేస్తుందన్నారు.
ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం అనేది తెలంగాణలోని మహిళాలోకాన్ని గౌరవించినంత సంబరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఓరుగంటి గంగాధర్, శైలేందర్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రాంచందర్, సాయిలు, ఆర్మూర్ మండల అధ్యక్షుడు గంగాధర్, గొండ స్వామి, నగేశ్, శ్రీనివాస్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు
ఆర్మూర్ : చాకలి ఐలమ్మ సేవలను గుర్తించి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని రజక సంఘం జిల్లా అధ్యక్షుడు దమ్మన్నస్వామి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. పట్టణంలోని చాకలి ఐలమ్మ విగ్రహం ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా రజక సంఘం అధ్యక్షుడి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
రజక సంఘం ఆధ్వర్యంలో…
రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందున పటాకులు కాల్చి ముఖ్యమంత్రి కేసీఆర్ , ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి చిత్రపటానికి ఆదివారం క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు శంకర్ , యువజన జిల్లా అధ్యక్షుడు మీరా శ్రావణ్ మాట్లాడుతూ తెలంగాణ పోరాట యోధులను గుర్తించి తగిన గౌరవం కల్పించడంలో సీఎం కేసీఆర్ కృషికి ధన్యవాదాలు తెలుపుతూ రజకులమంతా రుణపడి ఉంటామన్నారు.
చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించడంతో ఐలమ్మకు తగిన గుర్తింపు రావడం సంతోషకరమైన విషయమన్నారు. ఐలమ్మ 1895 సెప్టెంబర్ 26న జన్మించారని, 1985 సెప్టెంబర్ 10న మరణించారన్నారు. కార్యక్రమంలో పెర్కిట్ గంగాధర్ , మీర నాగేశ్ , మాక్లూర్ రాజు, సల్లగరిగె విజయ్ , ఓరగంటి అనురాగ్ , సల్లగరిగె యువరాజ్ , విశాల్ , విఫుల్ , రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.