హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం భయంతో అనేక అంతర్జాతీయ కంపెనీలు పెద్ద సంఖ్యలో తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయని, ఇంతటి కష్టకాలంలోనూ తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతున్నదని గవర్నర్ తమిళిసై అన్నారు. 2014 నుంచి 2022 వరకు 1,41,735 ఉద్యోగాలు భర్తీ చేశామని, ప్రస్తుతం మరో 80,039 ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. మొత్తంగా 2,21,774 ఉద్యోగ నియామకాలు చేపట్టడం చరిత్రలో అపురూప ఘట్టమని వెల్లడించారు. వీటికి అదనంగా కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించే ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు. ఉద్యోగాలు స్థానికులకు దక్కేలా 95 శాతం లోకల్ క్యాడర్ వ్యవస్థను రూపొందించుకున్నామన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభమైన సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.
విద్యారంగంలో వికాసం దిశగా ప్రభుత్వం పయనిస్తున్నదని గవర్నర్ తమిళిసై అన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యా బోధనతోపాటు తగిన ఆహారం, వసతి ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం గురుకుల విద్యకు ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు. దేశంలో అత్యధికంగా వెయ్యికి పైగా గురుకులాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం గర్వించదగిన విషయమన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులను కల్పించాలని, పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం మన ఊరు/మన బస్తీ-మన బడి అనే బృహత్తర ప్రణాళికను అమలు చేస్తున్నదని వెల్లడించారు. ఇందులో భాగంగా మూడు దశల్లో రూ.7,289 కోట్ల వ్యయంతో 26,065 స్కూళ్లలో 12 రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నదని చెప్పారు.