హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): యాసంగిలో బాయిల్డ్ బియ్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటనతో తెలంగాణ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలంగాణ రైతు సంఘం గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ దృష్టికి తీసుకెళ్లింది. సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి టీ సాగర్, ఉపాధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి గవర్నర్కు ఈ మేరకు మంగళవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో రైతుల్లో నెలకొన్న ఆందోళన తొలగించేందుకు వీలుగా గత యాసంగిలో బియ్యాన్ని ఎఫ్సీఐ పూర్తిస్థాయిలో సేకరించాలని, ఈ వానకాలం బియ్యం సేకరణకు గడువును ఫిబ్రవరి వరకు పొడిగించాలని కోరారు. వచ్చే యాసంగిలో బాయిల్డ్ రైస్ను షరతులు లేకుండా మద్దతుధరకు పూర్తిస్థాయిలో కేంద్రం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ధాన్యం సేకరణ బాధ్యతల నుంచి కేంద్రం తప్పించుకునే కుట్రలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. బియ్యం సేకరణలో ఎఫ్సీఐ తీవ్ర జాప్యం చేస్తున్నదని, గోదాముల నుంచి స్టాక్ తరలించేందుకు వ్యాగన్లు రావటం లేదని సీపీఐ నల్లగొండ జిల్లా సమితి కార్యదర్శి నెల్లికంటి సత్యం రాష్ట్ర గవర్నర్ తమిళసై సొందర్రాజన్కు ఒక లేఖ ద్వారా తెలిపారు. రోజుకు ఒక వ్యాగన్ పంపేలా చూడాలని ఆ లేఖలో కోరారు. ఈ యాసంగిలోనూ బాయిల్డ్ రైస్ తీసుకునేలా కేంద్రాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకునేది లేదని కేంద్రం చేసిన ప్రకటనతో జిల్లా రైతులు ఆందోళనలో ఉన్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండ శ్రీశైలం, నల్లగొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వీరెపల్లి వెంకటేశ్వర్లు, కున్రెడ్డి నాగిరెడ్డి గవర్నర్కు రాసిన లేఖలో కోరారు. సంగిలోనూ పూర్తిస్థాయిలో ధాన్యం సేకరించేలా కేంద్రాన్ని ఒప్పించాలని విజ్ఞప్తిచేశారు.