హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు బండారం మరోసారి బట్టబయలైంది. విదేశీ ఆర్థిక సాయంతో తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులకు కేంద్రం గత నాలుగేండ్లలో ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదని పార్లమెంటు సాక్షిగా వెల్లడైంది. కొత్త రాష్ర్టానికి పెద్దన్న తరహాలో సాయం చేయడంలో విఫలమయ్యామని చెప్పకనే చెప్పింది. అంతేకాకుండా గత ఐదేండ్లలో తెలంగాణ ఎలాంటి విదేశీ రుణాలు తీసుకోలేదని స్పష్టం చేసింది.
గత ఐదేండ్లలో ఆర్బీఐ, విదేశీ ఆర్థిక సంస్థలు, రీఫైనాన్సింగ్ సంస్థలు తెలంగాణకు ఇచ్చిన అప్పుల వివరాలను వెల్లడించాలని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కోరడంతో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్చౌదరి ఈ సమాధానమిచ్చారు. విదేశీ ఆర్థిక సాయంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు కేంద్రం అప్పును తప్ప గ్రాంట్ను ఇవ్వలేదని వెల్లడించారు. 2016-17 నుంచి ఇప్పటివరకు కేంద్రం అదనపు రుణం రూపంలో తెలంగాణకు రూ.2,610 కోట్లు ఇచ్చింది.
ఈ మొత్తాన్ని ఎప్పటికైనా వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సిందే. 2016-17లో తెలంగాణకు రూ.956 కోట్ల రుణం ఇచ్చిన కేంద్రం.. ఆ తర్వాత క్రమంగా రుణాలను తగ్గిస్తూ వచ్చింది. 2019-20లో రూ.207 కోట్ల రుణాన్ని మాత్రమే ఇచ్చిన కేంద్రం.. ఈ ఆర్థిక సంవత్సరం 9 నెలలు గడిచినా తెలంగాణకు ఒక్క రూపాయి రుణం కూడా ఇవ్వలేదని స్పష్టమైంది. 2016-17లో రాష్ర్టానికి గ్రాంట్ రూపంలో కేవలం రూ.30.72 కోట్లు ఇచ్చామని, ఆ తర్వాత నాలుగేండ్లుగా గ్రాంట్ రూపేణా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వెల్లడించింది.
తెలంగాణకు ఆర్బీఐ కూడా ఎలాంటి రుణాలు ఇవ్వలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్బీఐ రుణాలు ఇవ్వదని, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ-వ్యయాల్లో అంతరాన్ని పూడ్చేందుకు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ, వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ లాంటి తాత్కాలిక సదుపాయాలను మాత్రమే కల్పిస్తుందని తెలిపింది. ఇక జపాన్ ప్రభుత్వం, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ (ఐబీఆర్డీ), ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ (ఐడీఏ) వంటి విదేశీ సంస్థల నుంచి తీసుకొన్న రుణాలకు తెలంగాణ ప్రభుత్వం గత ఐదేండ్లలో అసలు కింద రూ.382.21 కోట్లు, వడ్డీ కింద రూ.147.53 కోట్లు చెల్లించినట్టు వెల్లడించింది. తెలంగాణ చెల్లించాల్సిన విదేశీ రుణాల్లో సింహభాగం ఉమ్మడి ఏపీలో తీసుకున్నవేనని, వాటికి రాష్ట్ర ప్రభుత్వం అసలు, వడ్డీ కడుతున్నదని వివరించింది.
బీజేపీ నేతలూ.. నోర్లు మూసుకుంటారా?
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఇస్తున్నదని ఊదరగొడుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు ఇకనైనా తమ ప్రగల్భాలను కట్టిపెట్టాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు. సాధారణంగా కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంటుంది. అన్ని రంగాల్లో నిలదొక్కుకునే వరకు ఉదారంగా సాయం చేయాలి. అదనపు నిధులు అందించి చేయూతనివ్వాలి. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. చట్టబద్ధ వాటాగా తెలంగాణకు రావాల్సిన నిధులే తప్ప అదనపు సాయం చేయడంలేదు. పైపెచ్చు సొంతగా ఎదుగుతున్న తెలంగాణపై అక్కసు ప్రదర్శిస్తున్నది. రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలకంగా మారడంతోపాటు తెలంగాణలోని సగానికిపైగా జనాభాకు ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా ధాన్యం కొనుగోలు చేయలేమంటూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నది.