హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని అప్పులపాలు చేశారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వీసమెత్తు వాస్తవం లేదని తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే-2022 తేల్చింది. ఇటీవల రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) విడుదల చేసిన పత్రంలో సైతం ఇదే విషయాన్ని వెల్లడించినట్టు ఈ నివేదిక పేర్కొన్నది. దేశంలోని ఇతర రాష్ర్టాలతో, ప్రత్యేకించి బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ అప్పులు తక్కువేనని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఐదు సంవత్సరాల కాలపరిమితిలో తెలంగాణ చేసిన అప్పులు జీఎస్డీపీలో కేవలం 17.19 శాతమేనని తెలిపింది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్, పంజాబ్ 38.32 శాతం అప్పులు చేసినట్టు వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ (34.80 శాతం) మధ్యప్రదేశ్ (23.62 శాతం) అప్పు చేసినట్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ సైతం తెలంగాణ కంటే 11 శాతం ఎక్కువ అప్పు చేసినట్టు నివేదిక పేర్కొన్నది.