హైదరాబాద్, జనవరి 12 : తెలంగాణ ఆస్తులను మింగే సరికొత్త కుట్రకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరలేపింది. ఆస్తులను లాక్కోవడానికి ఏకంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014కు సవరణ చేయాలని డిమాండ్ చేసింది. బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్భల్లా నేతృత్వంలో రెండు రాష్ట్రాల సీఎస్లతో విభజన సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం విద్యుత్తు విషయంలో తెలంగాణకు తాము ఇచ్చేదేమీ లేదని, తెలంగాణ నుంచే తమకు నిధులు రావాలని వాదించింది. సింగరేణిలో వాటాతోపాటు దిల్, ఎస్ఎఫ్సీ భూముల్లో వాటా వస్తుందని, తెలంగాణలో వసూలయ్యే పన్నుల్లో కూడా వాటా ఇవ్వాలని వింత డిమాండ్లు చేసింది. ఏపీ తీరుపై తెలంగాణ తీవ్రంగా స్పందించింది. విద్యుత్తుకు సంబంధించి ఏపీ నుంచి తమకే రూ.12 వేల కోట్లు రావాలని లెక్కలతోసహా వివరించింది. సింగరేణిలో ఏపీకి హక్కు ఎలా ఉంటుందని నిలదీసింది. ఏపీ కేసులు ఉపసంహరించుకొంటేనే పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టంచేసింది. పలు సందర్భాల్లో అజయ్భల్లా తెలంగాణ అభిప్రాయంతో ఏకీభవించారు.
ఏడున్నరేండ్ల తర్వాత చట్ట సవరణా?
తెలంగాణకు రావాల్సిన బకాయిలను ఎగ్గొట్టడంతోపాటు ఇక్కడి ఆస్తులపై కన్నేసిన ఏపీ ప్రభుత్వం, ఏడున్నరేండ్ల తర్వాత ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు తేవాలని ప్రతిపాదించటంతో అజయభల్లా కూడా నిర్ఘాంతపోయారు. తెలంగాణకు చెందిన ఇంచు జాగానైనా, పైసా ఆదాయాన్నైనా కూడా వదులుకొనేది లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తేల్చిచెప్పారు. ‘నథింగ్ డూయింగ్.. విభజన చట్టంలోనే సింగరేణి తెలంగాణకు చెందుతుందని స్పష్టంగా ఉన్నది. ఇందులో మాట్లాడటానికి ఏమీలేదు. తెలంగాణలోని ఆస్తులు, సంస్థలు తెలంగాణకే చెందుతాయి. రాష్ట్రం ఏర్పడిన ఏడున్నరేండ్ల తర్వాత చట్టానికి ఏవిధంగా సవరణలు చేస్తారు? ఒక్కసారి సవరణలు చేస్తే అనేక సమస్యలు చుట్టుముడతాయి. ఈ వాదన ఏ రకంగానూ సమ్మతం కాదు’ అని స్పష్టంచేశారు.
భూముల్లో భాగం కావాలట!
విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ సంస్థల్లో కీలకమైన దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్ (దిల్)కు ఉమ్మడి రాష్ట్రంలో 5 వేల ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూములను అభివృద్ధి చేయకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఓ జీవో ద్వారా వాటిని 2015లో వెనక్కు తీసుకున్నది. ఈ జీవోపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసి స్టే ఆర్డర్ తీసుకున్నది. ఈ భూమిలో వాటా ఇవ్వాలని ఇప్పుడు కోరుతున్నది. దీనిపై కోర్టులో కేసు ఉన్నందున మాట్లాడేది ఏమీలేదని తెలంగాణ అధికారులు స్పష్టంచేశారు. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు చెందిన 250 ఎకరాల భూమిపై కూడా కోర్టులో కేసు ఉన్నందున చర్చ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. కోర్టు కేసులు ఉపసంహరించుకొంటే తప్ప పురోగతి ఉండదని స్పష్టంచేశారు.
ఏపీ చెల్లించాల్సిన బకాయిలు ఎన్నో..
ట్యాక్స్ ఎరియర్స్, రిఫండ్కు సంబంధించి సెక్షన్ 50, 51, 56తోపాటు ఏ జాబితాలోనూ చేర్చని సంస్థల విభజనపై ఏపీ ప్రభుత్వం చట్ట సవరణ కోరగా తెలంగాణ తిరస్కరించింది. దీంతో చట్ట సవరణకు అవకాశం లేకపోతే కేంద్రం ఆ నష్టాన్ని పూడ్చేందుకు సహాయం చేయాలని ఏపీ కోరింది. నిజానికి తెలంగాణకు ఏపీ ఇవ్వాల్సిన బకాయిలు అనేకం ఉన్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఉన్న నగదు నిల్వలను, ఆ తర్వాత కేంద్రం నుంచి వచ్చిన సబ్సిడీలను ఏపీ ఇప్పటివరకు ఇవ్వలేదు. ఆ సొమ్మును వెంటనే చెల్లించాలని తెలంగాణ డిమాండ్ చేసింది. కేంద్ర పథకాలకు చెందిన రూ.495 కోట్లు ఏపీ ఇంకా ఇవ్వనేలేదని కేంద్రానికి తెలంగాణ తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి హైకోర్టు, ఉమ్మడి రాజ్భవన్ నిర్వహణకు అయిన ఖర్చుల కింద రూ.315 కోట్లు ఏపీ చెల్లించాల్సి ఉన్నది. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ నిధికి చెందిన రూ.456 కోట్లు, క్రెడిట్ ఫార్వర్డ్కు చెందిన రూ.208 కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉన్నదని, వీటిని వెంటనే ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ చేసింది.
నోడల్ అధికారుల నియామకం..
ఇరు రాష్ర్టాల మధ్య నగదు నిల్వల విభజన పరిశీలనకు ఇద్దరు నోడల్ అధికారులను నియమించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సూచించారు. రెండు రాష్ట్రాల ఆర్థిక శాఖల స్పెషల్ సీఎస్లను నామినేట్ చేయాలని కోరారు. దీంతో తెలంగాణ తరఫున ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణారావు, ఏపీ నుంచి ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ను నామినేట్ చేశారు. సమావేశంలో తెలంగాణ నుంచి సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్, విద్యాశాఖ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, సింగరేణీ సీఎండీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ మాకు ఇవ్వాల్సింది రూ.12,111 కోట్లు
విద్యుత్తుకు సంబంధించి తెలంగాణకు ఏపీ రూ.12,111 కోట్లు బకాయి ఉన్నదని సోమేశ్కుమార్ తెలిపారు. వీటిని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణే తమకు రూ.3,442 కోట్ల విద్యుత్తు బకాయిలు చెల్లించాల్సి ఉన్నదన్న ఏపీ వాదనను తిప్పికొట్టారు. ఏపీకి ఇవ్వాల్సిన బకాయిలు పోగా ఆ రాష్ట్రం తమకు రూ.12,111 కోట్లు ఇవ్వాలని తెలంగాణ అధికారులు లెక్కలతోసహా వివరించారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే ముందుగా ఏపీ వేసిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సింగరేణిపై పేచీ
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని షెడ్యూల్ 11(ఏ) ప్రకారం సింగరేణి కాలరీస్తోపాటు అనుబంధ సంస్థ అయిన హెవీ మిషనరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (ఆప్మెల్)లో 51 శాతం షేర్లు తెలంగాణకు చెందుతాయి. మిగిలిన 49 శాతం షేర్లు కేంద్ర ప్రభుత్వానివి. ఈ నిబంధన స్పష్టంగా ఉన్నప్పటికీ ఏపీ అధికారులు సింగరేణిలో తమకు వాటా వస్తుందని వింత వాదన లేవదీశారు. ఈ సంస్థల్లో ఏపీకి వాటా ఇవ్వాలనడం అర్థం లేని విషయమని తెలంగాణ అధికారులు తేల్చి చెప్పారు. దీనిపై ఎలాంటి చర్చకు తావు లేదని కుండ బద్దలు కొట్టారు. తెలంగాణ వాదనతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఏకీభవించారు. ఏపీ ఉన్నత విద్యామండలి విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా 2017లో కేంద్రం ఉత్తర్వులిచ్చింది. దీనిపై ఏపీ హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. ఇప్పుడు తాజాగా ఈ సమస్యను ఏపీ లేవనెత్తగా కేసు కోర్టులో ఉన్నందున సమస్యను పరిష్కరించడానికి ఆస్కారం లేదని తెలంగాణ తెలిపింది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ సమస్య పరిష్కారానికి తెలంగాణ ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావుతో పాటు ఆర్అండ్బీ ఈఎన్సీ, ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్లు, ఏపీకి చెందిన అదే స్థాయి అధికారులతో కమిటీ వేసుకోవాలని కేంద్రం సూచించింది. కమిటీ వేసి నిర్దిష్ట సమయంలోగా తమకు నివేదిక ఇవ్వాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి కోరారు.