జనాభా గణనలో కులగణన కోసం అదనంగా ఒక ‘కాలమ్’ పెట్టాలని దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయపార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అసెంబ్లీలు తీర్మానాలతో డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దేశంలో 56 శాతం జనాభా గల బీసీలకు రూపాయి ఖర్చు లేకుండా అదనంగా కాలమ్ పెట్టడానికి ముందుకురాని కేంద్రం 70 కోట్ల మంది బీసీలను ఎలా ఉద్ధరిస్తుంది? బీసీలు ఈ దేశ భూమిపుత్రులు కాదా? ఎందుకు ఇంత వ్యతిరేకత?
కులగణన చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారు, టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో తీర్మానం చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి జనగణనలో ‘కులగణన’ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు అసెంబ్లీలో తీర్మానం చేసి ‘కులగణన’ చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ కులగణన చేపట్టాలని కోరుతున్నాయి.
జనగణనలో కులగణన చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ బీసీ ఫ్రంట్, మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేశాయి. దీనికి కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ.. ‘కులగణన చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని, అది ఆచరణలో సాధ్యం కాద’ని వితండవాదం చేస్తున్నది. గతంలో 2011లో జరిపిన సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేలో 46 లక్షల కులాలు/ ఉపకులాల పేర్లు ప్రజలు చెప్పారని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నది. 1931లో బ్రిటీషు వారు జరిపిన జనగణనలో దేశంలో 4,147 కులాలున్నట్లు తేలింది. అటువంటప్పుడు ప్రస్తుతం కేంద్రం చెప్పే 46 లక్షల కులాలు/ ఉపకులాల వాదన అసత్యం. కులగణన చేయడానికి కేంద్రానికి ఇష్టం లేక డొంకతిరుగుడు వాదనలు చేస్తున్నది. ప్రస్తుతం కేంద్రంలో ఓబీసీ జాబితాలో 2,642 కులాలున్నాయి. రాష్ర్టాల జాబితాలో 2,892 బీసీ కులాలున్నాయి. 2011లో జరిగిన జనగణనలో ఎస్సీలు 1,234 కులాలు, ఎస్టీలు 698 కులాలు ఉన్నట్లు తేల్చారు. అయితే ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ అగ్రకులాలు అన్ని కులాలను కలిపినా 6 వేలకు మించవు. అలాంటప్పుడు పొంతనలేని విధంగా 46 లక్షల కులాలు/ ఉపకులాలున్నాయనే వితండవాదన చేయటం గర్హనీయం. భాష, ప్రాంతం, రాష్ర్టాలను బట్టి కులాల పేర్లు మారినా ఇప్పుడున్న బీసీ జాబితాకు పనికొచ్చే పేర్లే జనగణన పట్టికలో గణన చేస్తారు. అలాంటప్పుడు ఎందుకు సందిగ్ధం? ఎస్సీ/ఎస్టీ కులాలకు లేని ఇబ్బందులు బీసీలకే ఎందుకొస్తాయి!
ఒకసారి కులాలవారీ జనాభా గణన చేస్తే 74 ఏండ్ల స్వతంత్ర భారత సాంఘిక, ఆర్థిక, రాజకీయ ముఖచిత్రం తెలిసివస్తుంది. ఎన్ని కులాలున్నాయి. ఎన్ని అంతరించాయి? అలాగే స్వాతంత్య్ర ఫలాలు, ప్రజాస్వామ్య ఫలాలు ఏయే కులాలు ఎంత శాతం పొందుతున్నాయనే వాస్తవాలు బయటకు వస్తాయి. అభివృద్ధి చెందిన భారతదేశంలోని పారిశ్రామిక, ఆర్థిక, రాజకీయ ఫలాలు ఏ కులాలకు దక్కాయి, ఇంతవరకు అభివృద్ధి ఫలాలకు నోచుకోని కులాలకు వారి, వారి వాటా కేటాయింపులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ప్రణాళిక రూపకల్పన చేయడానికి ‘కులగణన’ ప్రధాన భూమిక పోషిస్తుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం కల్పించిన సదుపాయాల కోసం కూడా కులగణన అవసరం. దీనితో ఒక్కో కులం జనాభాతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ వివరాలు సేకరించి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయటానికి అవకాశం లభిస్తుంది. జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టవచ్చు. బీసీ కులాల మధ్య ఉన్న వ్యత్యాసాలను తొలగించడానికి ఒకేరకమైన సారూప్యత కలిగినవారిని గుర్తించి గ్రూపులుగా వర్గీకరించే అవకాశం ఉంటుంది.
1.రాజ్యాంగం కల్పించిన బీసీ రిజర్వేషన్ల కోసం కులగణన కావాలి. రాజ్యాం గంలోని 15(4), 16(4) (5) ప్రకారం బీసీలకు విద్య- ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఈ రిజర్వేషన్లు అమలుచేయాలంటే ఏయే కులాలకు విద్య, ఉద్యోగరంగాల్లో ఎంత ప్రాతినిధ్యం ఉన్నది, ఏయే కులాలు సామాజిక వివక్షకు గురవుతున్నాయె తెలువాలి. ఏయే కులంలో అసమానతలున్నాయో తెలుసుకోవాలంటే ప్రతి కులం జనాభా, ఇతర వివరాలు తెలువాలి. ఒక కులం జనాభా మొత్తం తెలిస్తే, వారి జనాభా ప్రకారం విద్య-ఉద్యోగరంగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత శాతం ఉందో తెలుస్తుంది. దాన్నిబట్టి ప్రాతినిధ్యం లేని కులాలను బీసీ జాబితాలో కలుపుతారు. ఇది తెలియాలంటే ప్రతి కులం జనాభా వివరాలున్నపుడే ఇది సాధ్యం అవుతుంది.
2.రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (డీ-6) ప్రకారం పంచాయతీ సంస్థల్లో ఆర్టికల్ 243-టీ 6 ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. వీటిని అమలుచేయాలంటే.. వార్డు మొదలు మండలం, మున్సిపల్ దాకా బీసీ జనాభా ఎక్కువ ఉంటే ఆ స్థానాలు బీసీలకు కేటాయిస్తారు. కానీ.. చట్టబద్ధమైన కులగణన వివరాలు లేకపోవటంతో లాటరీ పద్ధతిలో బీసీ స్థానాలు కేటాయిస్తున్నారు. ఏ గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను బీసీలకు కేటాయించాలి, ఎంత శాతం కేటాయించాలనే విషయంలో బీసీ జనాభా లెక్కలు లేక కోర్టు కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కులగణనతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది!
3.1992లో మండల్ కమిషన్ కేసు నేపథ్యంలో రిజర్వేషన్ల కేసు సందర్భంగా సుప్రీంకోర్టు 11 మంది జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం బీసీ జాబితాలో ఉన్న కులాల పరిస్థితిని పదేండ్లకోసారి సమీక్షించి అభివృద్ధి చెందిన కులాలను బీసీ జాబితా నుంచి తొలగించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పు అమలుచేయాలంటే ప్రతి కులం జనాభా, ఆ కులంలో ఉద్యోగస్థుల శాతం, విద్యావంతుల శాతం తెలువాలి. ఇది తెలియాలంటే కులగణన జరగాలి.
4.సుప్రీంకోర్టు, హైకోర్టులు రిజర్వేషన్ల కేసు వచ్చిన ప్రతిసారి కులగణన చేయాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చాయి. 1992 మండల్ కేసుతో పాటు 2006లో కేంద్రవిద్యాసంస్థల్లో రిజర్వేషన్లపై పెట్టిన కేసు సందర్భంగా, 2010లో పంచాయతీరాజ్ రిజర్వేషన్ల కేసు సందర్భంగా కూడా సుప్రీంకోర్టు బీసీ కులాల లెక్కలు తేల్చాలని పేర్కొంది. సుప్రీంకోర్టు, హైకోర్టులు కులగణన చేయాలంటూ దాదాపు 200 తీర్పులు ఇచ్చాయి.
5.దేశంలో దశాబ్దాలుగా ఎస్సీ/ఎస్టీ/బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లున్నవి. ఎస్సీ/ఎస్టీలకు కులగణన జరుగుతున్నందున వారి, వారి జనాభా ప్రకారం అన్ని రంగాల్లో రిజర్వేషన్లు పొందుతున్నారు. కేంద్రంలో, రాష్ర్టాల్లో ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేశారు. బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి. కానీ బీసీ కులాల లెక్కలు లేనందున జనాభా ప్రకారం రిజర్వేషన్లు లేవు, సబ్ ప్లాన్ లేదు. బీసీల జనాభా 56 శాతం ఉంటే రిజర్వేషన్లు 25 శాతమే పొందుతున్నారు.
6.1931లో చేసిన జనాభా గణన ఆధారంగా.. బీసీలకు రాష్ట్రంలో 47 ఏండ్లుగా అనంతరామన్ కమిషన్ నివేదిక ప్రకారం 25 శాతం రిజర్వేషన్లు లభిస్తున్నాయి. కేంద్రంలో మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారం 29 ఏం డ్ల నుంచి ఉద్యోగ, విద్యారంగాల్లో 27 శాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. ఈ కాలంలో ఏయే కులాలు రిజర్వేషన్లు పొందాయి, ఇంకా పొందని కులాలేవి, ఏ కులాలు అభివృద్ధి చెందా యి వంటి వివరాలు తెలువాలంటే కులాల వారి లెక్కలు అవసరం. దీని వల్ల కొత్త మార్గదర్శకాలు రూపొందిం చవచ్చు. తద్వారా అభివృద్ధి చెందిన కులాలను జాబితా నుంచి తొలగించ డం, అభివృద్ధి చెందని కులాల కోసం చర్యలు తీసుకోవటం, ఇంకా గుర్తింపు పొందని కులాలను జాబితాలో చేర్చటానికి వీలవుతుంది.
7.కేంద్రంలో, అనేక రాష్ర్టాల్లో బీసీ రిజర్వేషన్లను నాలుగు గ్రూపులుగా వర్గీకరణ చేయలేదు. బీసీకులాల మధ్య సాంఘిక, ఆర్థిక, రాజకీయ వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. కొన్ని కులాలు అత్యంత వెనుకబడినవి ఉన్నాయి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధానికి విజ్ఞప్తి చేసిన తర్వాత కేంద్రంలో బీసీ రిజర్వేషన్లను నాలుగు గ్రూపులుగా వర్గీకరణ చేయడానికి నాలుగేండ్ల కిందట జస్టిస్ రోహిణి కమిషన్ను నియమించింది. కులగణన వివరాలు లేకపోవడంతో రోహిణి కమిషన్ నాలుగేండ్లుగా ఎటూ తేల్చలేక వర్గీకరణ చేయలేకపోతున్నది. కులగణన వివరాలు కావాలని కమిషన్ కేంద్రానికి 6 లేఖలు రాసింది.
8.కేంద్రంలో జాతీయ బీసీ కార్పొరేషన్, రాష్ర్టాల్లో బీసీ కార్పొరేషన్తో పాటు ఆయా కులాల ప్రత్యేకాభివృద్ధికి కుల కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఏర్పాటుచేశారు. జనాభా లెక్కల వివరాలు లేకపోవటంతో ఎంత బడ్జెట్ కేటాయించాలనే విషయంలో ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
9.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద కులాల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాయి. కులగణన ఉంటే బడ్జెట్ కేటాయింపు, సంక్షేమ పథకాల్లో జనాభా ప్రకారం ఎంత శాతం కేటాయించాలని శాస్త్రీయమైన ఆధారాలు లభిస్తాయి.
2010లో కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేసింది. అలాగే 2018 ఆగస్టు 31న అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ఆధ్వర్యంలో ఈ దఫా జరిగే జనగణనలో కులాల వారి వివరాలు సేకరించాలని నిర్ణయం తీసుకొని విధాన ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు?
రాజ్యాంగబద్ధంగా 1953లో నియమించిన కాకా కాలేల్కర్ కమిషన్, 1979లో నియమించిన మండల్ కమిషన్ జనాభా గణనలో కులగణన చేయాలని కేంద్రానికి సిఫార్సు చేశాయి. మొత్తం దేశంలోని వివిధ రాష్ర్టాల్లో నియమించిన 246 బీసీ కమిషన్లు కులగణన చేయాలని సిఫారసు చేశాయి. అయినప్పటికీ కేంద్రం పట్టించుకోవటం లేదు.
దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేశాయి. కానీ వాటికి చట్టబద్ధత ఉండదు. సెన్సస్ విభాగం చేసిన దానికే చట్టబద్ధత ఉంటుందని కోర్టు తీర్పు చెప్పింది. బీసీ కమిషన్లు, కోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు కులగణన చేయాలని కోరుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నది?
జనాభా లెక్కలు తీస్తే ఈ అణచివేతకు గురైన కులాలు అధిక సంఖ్యలో ఉన్నాయని తెలిస్తే అన్నిరంగాల్లో వాటా అడుగుతారనే భయం కావొచ్చు. కులపరమైన సమాచారాన్ని సేకరించినట్లయితే దేశంలో ఆయా కులాల మధ్యన ఘర్షణ జరిగే ప్రమాదమున్నదని కేంద్రం అంటున్నది. 1881-1931 వరకు బ్రిటిష్ హయాంలో 6 సార్లు కులగణన జరుగలేదా! నేటి పాలకుల భయమంతా.. జనాభా ప్రకారం అన్నిరంగాల్లో వాటా అడుగుతారనే. దేశంలోని 70 కోట్లమంది బీసీలు అభివృద్ధి చెందకుండా దేశం అగ్రదేశంగా తయారవుతుందా?
(వ్యాసకర్త: జాతీయ బీసీ సంక్షేమ సంఘం, అధ్యక్షులు)
–ఆర్.కృష్ణయ్య
90000 09164