హైదరాబాద్: ఈ నెల 7 నుంచి రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి ప్రొటెం ఛైర్మన్ సయ్యద్ అమీనుల్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, లెజిస్లేటివ్ సెక్రెటరీ డా. వి. నరసింహా చార్యులు పాల్గొన్నారు.
రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ (MA & UD) అరవింద రావు, ప్రిన్సిపల్ సెక్రెటరీ (GAD) వికాస్ రాజ్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ – రవిగుప్తా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ – సీవీ అనంద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ – స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీస్ కమిషనర్ – మహేష్ భగత్, DIG (ఇంటలిజెన్స్) – శివకుమార్, అసెంబ్లీ చీఫ్ మార్షల్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ఈ నెల 7 నుంచి రాష్ట్ర రెండో శాసనసభ 8వ సెషన్, శాసనమండలి 18వ సెషన్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని చెప్పారు. గత సమావేశాలు సజావుగా జరుగడానికి సహకరించిన అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. గత సమావేశాల్లో మాదిరిగానే అధికారులు సహకారం అందించాలని కోరారు. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలన్నారు.
గత సమావేశాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న ప్రశ్నలకు జవాబులను వెంటనే పంపించాలని సూచించారు. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆరోగ్యశాఖ అధికారులు కరోనా టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సూచించారు. శాసనసభ, మండలి సమావేశాలు సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ వారు పూర్తి సహాయ, సహకారాలను అందించాలని కోరారు.