హైదరాబాద్, జనవరి 25 : ఐదుగురు తెలంగాణ వాసులకు అత్యున్నత పౌర పురస్కారాలైన ‘పద్మ’ అవార్డులు వరించాయి. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ ‘కొవాగ్జిన్’ను ఆవిష్కరించి ప్రజల ప్రాణాలను కాపాడిన భారత్ బయోటెక్ అధినేతలను, అంతరించిపోతున్న నృత్య, వాయిద్య కళలకు జీవం పోస్తూ, భవిష్యత్తు తరాలకు అందించేందుకు తపిస్తున్న ముగ్గురు కళాకారులను కేంద్రం పద్మ అవార్డులకు ఎంపికచేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం మంగళవారం పద్మ పురస్కార విజేతలను ప్రకటించింది. ఇందులో భారత్ బయోటెక్ అధినేతలు కృష్ణా ఎల్లా, సుచిత్ర ఎల్లా దంపతులకు సంయుక్తంగా ‘పద్మభూషణ్’ వరించింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ భారత్ బయోటెక్ మన దేశానికే కాదు.. ప్రపంచం మొత్తానికి భరోసా ఇచ్చింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 8 నెలల్లోనే టీకా అభివృద్ధిచేసింది. ఈ విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్రం పద్మభూషణ్ ఇచ్చింది.
వికసించిన పద్మం…
ప్రముఖ కూచిపూడి నర్తకి డాక్టర్ జీ పద్మజారెడ్డిని పద్మశ్రీ వరించింది. కూచిపూడి నృత్యానికే జీవితం అంకితం చేసిన ఆమె.. దేశ, విదేశాల్లో అనేక ప్రదర్శనలచ్చి అవార్డులు, సత్కారాలు అందుకొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నుంచి మొదటిసారి 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సంగీత నాటక అకాడమీ అవార్డు తీసుకున్నారు. కాకతీయుల వైభవానికి ప్రతీకగా, తెలంగాణ చరిత్రకు తార్కాణంగా నిలిచేలా ఆమె ప్రదర్శించిన ‘కాకతీయం’ నృత్యరూపం బహుళ ప్రాచుర్యం పొందింది.
నృత్త రత్నావళిలోని ప్రతి అంశాన్ని నృత్యరూపకంగా తీసుకువస్తా: పద్మజారెడ్డి
పద్మశ్రీ అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. కాకతీయం నాకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. అందులోని అన్ని సిరీస్లను ప్రదర్శిస్తాను. జాయపసేనాని రచించిన నృత్తరత్నావళిలోని ప్రతి అంశాన్ని నృత్యరూపకంగా తీసుకురావడమే నా జీవితాశయం.
కిన్నెర వాద్యానికి ఊపిరులూదిన మొగులయ్య
అంతరించిపోతున్న మెట్ల కిన్నెర వాయిద్యాన్ని వారసత్వంగా అందిపుచ్చుకోవడమే కాదు.. ఏకంగా ‘12 మెట్ల కిన్నెర’ను సృష్టించిన దర్శనం మొగులయ్యకు పద్మశ్రీతో సముచిత సత్కారం లభించింది. తన వాద్యాన్నే ఇంటిపేరుగా మార్చుకొని ‘కిన్నెర మొగులయ్య’గా స్థిరపడిన ఆయన కిన్నెరతో రాగాలు పలికించగల అతికొద్ది మందిలో ఒకరు. 12 మెట్ల కిన్నెరను వాయిస్తూ సంతలు, జాతర్లలో జీవనం గడిపిన మొగులయ్యకు స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత గుర్తింపు లభించింది. 2016లో మొగులయ్య ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వం పట్టం కట్టింది. కేసీఆర్ చేతుల మీదుగా ఆయన ఉగాది పురస్కారం అందుకొన్నారు. ఇటీవలే సెభాష్ భీమ్లానాయకా.. అంటూ భీమ్లానాయక్ సినిమా టైటిల్ సాంగ్లో మొగులయ్య తన కిన్నెర వాయిస్తూ పాడిన పాట అందరినీ ఆకట్టుకొన్నది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీలోనే ప్రయాణించాలని మొగులయ్య పలుచోట్ల తన కిన్నెరతో పాటలు సైతం పాడారు. మొగులయ్య పాటకు ముచ్చటపడిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో జీవితకాలం ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. అవార్డుకు మొగులయ్య ఎంపిక కావడంపై సజ్జనార్ హర్షం వ్యక్తంచేశారు.
అయిదు తరాల కళాకారుల వంశం
నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం అవుసులకుంట దర్శనం మొగులయ్య స్వస్థలం. ఐదు తరాల కళాకారుల వంశం. తాత ముత్తాతల నుంచి కిన్నెర వాయించేవారు. వారి నుంచి కళను నేర్చుకొని, పల్లె ఒడినే సంగీత బడిగా మార్చుకొని రాగాలు పలికించారు. తరతరాల తెలంగాణ జీవన విధానాన్ని, చారిత్రక గాథల్ని ఒడిసిపట్టి పాటల రూపంలో కిన్నెర మెట్ల ద్వారా మొగులయ్య ప్రచారం చేశారు.
ఈ పురస్కారం తెలంగాణ ప్రభుత్వానికి అంకితం: కిన్నెర మొగులయ్య, కిన్నెర వాద్యకారుడు
ఢిల్లీ నుంచి ఫోన్ చేసి అవార్డు వచ్చిందని చెప్పారు. ఎంతో సంతోషం వేసింది. కలలో కూడా ఊహించని విధంగా పద్మశ్రీ రావడంతో నా జన్మ సాకారం అయ్యింది. ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వానికి అంకితం ఇస్తున్నా. తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాతే నన్ను గుర్తిస్తున్నారు. నా పేదరికాన్ని చూసి సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు నెలనెలా కళాకారులకు ఇచ్చే పింఛన్ రూ.10 వేలు అందిస్తున్నారు. ఉగాది పురస్కారం ఇచ్చి తెలంగాణ సర్కారు నన్ను గౌరవించింది. 8వ తరగతి పాఠ్యపుస్తకంలోనూ నా గురించి రాయడం ఎంతో సంతోషాన్నిస్తున్నది. నాకు సహకరించిన ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కళల పరిశోధకుడు రంగయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు. నేను చనిపోయేంత వరకు కిన్నెర కళను బతికేంచేందుకు ప్రయత్నిస్తా. ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా నేర్పిస్తా.
ఆదివాసీ డోలికి పద్మం
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, జనవరి 25: భద్రాద్రి జిల్లాలోని మణుగూరు మండలం కూనవరానికి చెందిన ఆదివాసీ వాద్య కళాకారుడు రామచంద్రయ్య పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ప్రాచీన వాద్యమైన ‘డోలి’ని వాయిస్తూ గిరిజనుల చరిత్రను గానం చేయడం ఆయన ప్రత్యేకత. డోలి వాద్య సాధనాన్ని వాయిస్తూ ప్రాచీన కళను కాపాడుతున్నారు.
ఏపీకి చెందిన ముగ్గురికి పద్మ
ఏపీకి చెందిన ముగ్గురికి పద్మ అవార్డులు వచ్చాయి. గోసవీడు షేక్ హసన్ (కళారంగం), డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు (వైద్యం), గరికపాటి నరసింహారావు (సాహిత్యం, విద్య) ఎంపికయ్యారు.
ఎమ్మెల్సీ కవిత అభినందనలు
‘పద్మశ్రీ’ అవార్డులకు ఎంపికైన తెలంగాణ అణిముత్యాలు దర్శనం మొగులయ్య, రామచంద్రయ్య, పద్మజారెడ్డిలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందనలు తెలిపారు. ‘మీరు సాధించిన పద్మశ్రీ రాష్ట్రానికి గర్వకారణం. నవతరాలకు ఆదర్శం’ అని ట్వీట్ చేశారు. ఏపీకి చెందిన ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. గరికపాటిని సన్మానిస్తున్న పాత ఫోటోను ట్యాగ్ చేశారు.
పద్మ గ్రహీతలకు సీఎం అభినందనలు
జీవితకాల విశిష్ట సేవలను గుర్తించి ఏటా భారత ప్రభుత్వం అందించే ‘పద్మ’ అవార్డులు తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులకు రావడం పట్ల సీఎం కే చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తంచేశారు. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మభూషణ్ అవార్డును దక్కించుకున్న కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల, కళల విభాగంలో పద్మశ్రీ అవార్డులను దక్కించుకొన్న దర్శనం మొగులయ్య, రామచంద్రయ్య, పద్మజారెడ్డిలను సీఎం కేసీఆర్ అభినందించారు. మంత్రి హరీశ్రావు, సత్యవతిరాథోడ్ తదితరులు అవార్డులకు ఎంపికైనవారికి శుభాకాంక్షలు తెలిపారు.
విజేతలకు సీజేఐ రమణ శుభాకాంక్షలు
తెలుగు రాష్ర్టాల నుంచి పద్మ పురస్కారాలకు ఎంపికైన ఏడుగురికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ టీకా ఆవిష్కరణలో తెలుగుజాతి కీర్తిపతాకను విశ్వ వీధుల్లో ఎగురవేసిన ఎల్లా దంపతులు, అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సారథ్యం వహిస్తున్న సత్య నాదెళ్ల పద్మభూషణ్కు ఎంపికకావడం ముదావహమన్నారు. అర్థవంతమైన ప్రవచనాలతో తెలుగు సాహితీ లోకాన్ని సుసంపన్నం చేసిన గరికపాటి నర్సింహారావు, విభిన్నరంగాల్లో విశిష్ట సేవలందించిన ఇతర పద్మశ్రీ అవార్డు గ్రహీతలు తెలుగుజాతికి గర్వకారణమని కొనియాడారు.