హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయ అభివృద్ధి పథకాలు అద్భుతంగా ఉన్నాయని మహారాష్ట్ర అధికారుల బృందం కితాబిచ్చింది. విత్తన పాలసీ, సీడ్ పార్ అభివృద్ధి, ఆన్లైన్ విత్తన సరఫరా విధానం, నాణ్యత నియంత్రణ పద్ధతి గురించి అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర అధికారుల బృందం బుధవారం రాష్ట్రంలో పర్యటించింది. రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలు, విత్తన పాలసీ, విత్తన సరఫరా, నాణ్యత నియంత్రణ విధానాన్ని రాష్ట్ర అధికారులు వారికి వివరించారు. రాజేంద్రనగర్లోని ఇస్టా అంతర్జాతీయ విత్తన పరీక్ష ల్యాబ్, బండమైలారంలో నిర్మాణంలో ఉన్న సీడ్ పార్, పలు విత్తన పరిశ్రమలు, అధునాతన విత్తన ప్రాసెసింగ్ సౌకర్యాలను ఆ బృందం పరిశీలించింది. కార్యక్రమంలో నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ బ్రిట్టో, మహారాష్ట్ర క్వాలిటీ కంట్రోల్ డైరెక్టర్ దిలీప్ జెండే, చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ సునీల్ బోరర్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హన్మంతు, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు తదితరులు పాల్గొన్నారు.