సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో సైబర్ మోసాలు కూడా విచ్చలవిడిగా జరుగుతూనే ఉన్నాయి. ఉన్నత ఉద్యోగులే కాదు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కూడా సైబర్ మోసాల బారినపడి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్ చోరుల వలలో చిక్కకుండా విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించే లక్ష్యంతో పోలీసులు, సైబర్ నిపుణులతో కలిసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సైబర్ పాఠాలు బోధిస్తున్నారు. తొలిదశలో నగరంలో 50 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి ఆన్లైన్లో బోధన నిర్వహిస్తున్నారు. నేర్చుకున్న పాఠాలను తోటి విద్యార్థులకు నేర్పించాల్సి ఉంటుంది.
-సిటీబ్యూరో, డిసెంబర్ 4(నమస్తేతెలంగాణ)
ఆమె పేరు స్వాతి (పేరు మార్చాం). ప్రతిరోజు స్కూల్కు వెళ్లేదారిలో పోకిరీలు వెంటపడి వేధించేవాళ్లు. అసభ్యంగా ప్రవర్తించి మనసు గాయపరిచారు. విషయం ఎవరికైనా చెబితే తండ్రిని చంపేస్తామని బెదిరించారు. ఆ బాధను ఇటు తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులకు చెప్పకుండా మనసులోనే దాచుకుంది. ఓ రోజు ఆ విషయాన్ని స్నేహితురాలితో పంచుకోగా.. సైబర్తో పాటు ఇతర నేరాలపై పాఠశాలలో అవగాహన పెంచుకున్న ఆ విద్యార్థి వెంటనే షీ టీంకు ఆన్లైన్లో ఫిర్యాదు చేసింది. పోకిరీలు ఉండే చోటు.. వారి వివరాలను పోస్ట్ చేసింది. ఆ మరుసటి రోజే రంగంలోకి దిగిన షీ టీం బృందం పోకిరీలను అదుపులోకి తీసుకొని తాట తీసింది. దీంతో ఊపిరి పీల్చుకున్న స్వాతి అప్పటి నుంచి షీటీంకు ఫిర్యాదు చేయడం.. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవడం నేర్చుకుంటున్నది.
ఆమె పేరు పావని. పదో తరగతి విద్యార్థి. వాళ్ల నాన్నకు ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. మీ అకౌంట్ వివరాలు చెప్పండి అంటూ ఆరా తీశాడు. ఆ వ్యక్తి బ్యాంక్ అధికారులు ఎవ్వరూ ఫోన్లో వివరాలు అడగరని మీరెవ్వరో మాకు తెలుసని.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంలో అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. ఈ సంఘటనలో తండ్రికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించింది అతడి కూతురు కావడం విశేషం.
అనవసర లింక్లను క్లిక్ చేసి వివరాల నమోదుతో పాటు ఫొటోలు కూడా అప్లోడ్ చేస్తున్న తల్లిని హెచ్చరించాడు ఆమె కుమారుడు. సైబర్ నేరగాళ్ల మాయలను వివరించాడు. ఇవన్నీ నీకెలా తెలుసునని కుమారుడిని అడగ్గా స్కూళ్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తానని వివరించాడు.
నేరగాళ్లు తమ పంథాను మార్చుకుంటున్నారు. సాంకేతికతను ఆసరాగా చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఒక్క క్లిక్తో లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ సైబర్ బెడద పొంచి ఉంది. ఈ తరుణంలో చిన్ననాటి నుంచే సైబర్ మోసాలపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం పెరిగింది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు, సైబర్ నిపుణులు సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసుకుని సైబర్కాంగ్రెస్ పేరుతో సైబర్ పాఠాలు బోధిస్తున్నారు. తొలుత నగరంలో 50 ప్రభు త్వ పాఠశాలలు ఎంపిక చేశారు. డిజిటల్ యుగంలో నేర్చుకోవాల్సిన సాంకేతిక అంశాలపై ప్రతిఒక్క విద్యార్థికి అవగాహన కల్పించడమే సైబర్ కాంగ్రెస్ లక్ష్యం. అందుకోసం ప్రతీ ప్రభుత్వ పాఠశాల నుంచి మెంటర్గా ఒక టీచర్ని, ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఆన్లైన్లో సైబర్ సెషన్స్ నిర్వహిస్తున్నారు. వాటిని నేర్చుకున్న ఆ టీం తమ పాఠశాల విద్యార్థులకు వివరిస్తున్నారు. మొత్తంగా సైబర్ మోసాలపై విద్యార్థులను జాగృతం చేయడానికి కార్యాచరణ కొనసాగుతుంది.
నేర్చుకుంటున్న అంశాలు..
ఇంటర్నెట్ అంటే ఏంటీ? దానిని ఎలా ఉపయోగించాలి?
సైబర్ మోసాలకు సంబంధించిన అంశాలపై కార్టూన్స్..
ఫేక్ సందేశాలు, కాల్స్పై అవగాహన
అపరిచితులు ఫోన్ చేస్తే మాట్లాడే విధానం..
డిజిటల్ పరికరాలతో సమయం గడపడంతో కలిగే లాభనష్టాలు..
అశ్లీల ఫొటోలు, సందేశాలు వస్తే వాటిని ఓపెన్ చేయకుండా ఎలా నిరోధించాలి?
ఆన్లైన్లో కొనుగోళ్లు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన సందేశాలపై..
వేధింపులు ఎదురైతే ఆన్లైన్లలో ఫిర్యాదు చేసే విధానం..
ఇంటర్నెట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
అప్రమత్తత అవసరం
రోజురోజుకూ సాంకేతికతపై ఆధారపడటం పెరుగుతోంది. టెక్నాలజీ వినియోగించాల్సిన అవసరం అందరికి తప్పనిసరిగా మారింది. డిజిటల్ విప్లవం వచ్చేసింది. చిన్నారులను ఇప్పటి నుంచే అందుకు తగినట్టుగా తీర్చిదిద్దాలి. టెక్నాలజీతో లాభం ఎంత ఉందో నష్టం అంతే ఉంది. ఏది మంచిది? ఏది చెడు? అనేదానిపై అవగాహన ఉండాలి. సైబర్ మోసాల బారిన పడే వాళ్లు పెరిగిపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులకు వీటిపైన అవగాహన ఉండదు. సైబర్ నేరాలు జరిగే తీరును పిల్లలకు వివరిస్తే వారు కుటుంబ సభ్యులను అప్రమత్తం చేస్తారు. హైదరాబాద్లో మా స్కూల్ సైబర్ కాంగ్రెస్కు ఎంపికైయింది. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు తీసుకుంటున్నాం.
-వి. కృష్ణమూర్తి, ప్రధానోపాధ్యాయుడు, సీతాఫల్మండి ప్రభుత్వ హైస్కూల్.
తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం
మాకు ఆన్లైన్లో సైబర్ పాఠాలు చెప్పడంతో పాటు ఆఫ్లైన్లోనూ సైబర్కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. షీటీంకు ఫిర్యాదు చేయడం ఎలానో నేర్పించారు. ఇంటర్నెట్ను ఎలా వినియోగించుకోవాలో నేర్పిస్తున్నారు. ఫిషర్ మెస్సేజ్లను ఎలా నిరోధించాలి? అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి వివరాలు ఇవ్వకూడదనే నేర్చుకున్నాం. ఇంట్లో తల్లిదండ్రులకు, బంధువులకు కూడా సైబర్ మోసాలపై మేమే అవగాహన కల్పిస్తున్నాం.
సైబర్ మోసాలపై అవగాహన
విద్యార్థులకు సైబర్ విషయాలపై అవగాహన కల్పిస్తున్నాం. వేధింపులు ఎదురైతే ఎలా ఫిర్యాదు చెయ్యాలి? బ్యాంక్ నుంచి వచ్చే ఫోన్కాల్స్ ఫేక్ అని ఎలా గుర్తించాలి? వ్యక్తిగత సమాచారం ఎంత వరకు షేర్ చెయ్యాలి? ఇంటర్నెట్ వినియోగం అవసరం ఎంత వరకు ఉంది? అనే విషయాలపై పిల్లలకు అవగాహన కల్పిస్తున్నాం. పోలీసులు, సైబర్ నిపుణులు నెలకు ఒకసారి మా టీంకు శిక్షణ ఇస్తారు. మేం ఆ విషయాలను పాఠశాల విద్యార్థులందరికి క్లాస్ తీసుకుని వారికి అవగాహన కల్పిస్తాం. పాటలు, కార్టూన్, వ్యాసరచన పోటీల ద్వారా సైబర్ మోసాలపై అవగాహన పెంచుతున్నాం. విద్యార్థులకు వివిధ రకాల టాస్క్ అప్పగించి వారికి సైబర్ విషయాలను తెలియజేస్తున్నాం.