ముంబై, ఏప్రిల్ 9 : దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.13,718 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.12,224 కోట్ల లాభంతో పోలిస్తే 12.22 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించింది. అలాగే డిసెంబర్ త్రైమాసికంలో వచ్చిన రూ.10,657 కోట్ల లాభం కంటే భారీ వృద్ధిని నమోదు చేసుకోవడం విశేషం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 9.64 శాతం ఎగబాకి రూ.70,698 కోట్లకు చేరుకున్నది.
ఈ సందర్భంగా కంపెనీ సీఈవో, ఎండీ కే కృతివాసన్ మాట్లాడుతూ..వరుసగా మూడో త్రైమాసికంలోనూ ఆశాజనక పనితీరు కనబరిచినట్టు, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ రెండంకెల వృద్ధిని సాధించినట్టు చెప్పారు. గడిచిన త్రైమాసికంలో కొత్తగా 12 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు, వీటిలో ఉత్తర అమెరికా నుంచి 5.4 బిలియన్ డాలర్ల ఒప్పందాలు రాగా, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల నుంచి మరో 2.8 బిలియన్ డాలర్ల ఒప్పందాలు వచ్చాయన్నారు.