న్యూఢిల్లీ, నవంబర్ 30: పెట్రోల్, డీజిల్పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెరిగింది. కరోనా మహమ్మారి సంవత్సరమైన 2020-21లో మునుపటి కంటే రెట్టింపునకు పైగా రాబడి వచ్చింది. కేంద్రానికి రూ.3.72 లక్షల కోట్ల ఆదాయం రాగా.. దాంట్లో రాష్ర్టాలకు దక్కిన వాటా రూ.20 వేల కోట్లు మాత్రమే. ఈ వివరాలను కేంద్రం మంగళవారం రాజ్యసభకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వక సమాధానమిచ్చారు. పెట్రోల్, డీజిల్పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కింద 2019-20లో కేంద్రానికి రూ.1.78 లక్షల కోట్లు లభించగా 2020-21లో (ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు) రూ.3.72 లక్షల కోట్లకు పెరిగింది. పెట్రోల్, డీజిల్పై పన్ను పెంచడంతోనే ఇది సాధ్యమైంది.
2019లో లీటర్ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.19.98. డీజిల్పై రూ.15.83 ఉండేది. గత ఏడాది ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పెంచింది. దాంతో అది పెట్రోల్పై రూ.32.98కి, డీజిల్పై రూ.31.83కి పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డులు బద్దలుకొట్టడంతో దేశ ప్రజలు బెంబేలెత్తిపోయారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోయి బతుకు భారమైంది. ప్రజాగ్రహ సెగ తగిలిన కేంద్రం… కంటితుడుపుగా ఇటీవల పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. లీటర్ పెట్రోల్పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూ.1.40 కాగా.. ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ రూ.11, రోడ్లు, మౌలిక సదుపాయాల పన్ను రూ.13, అలాగే వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పన్ను రూ.2.50 వసూలు చేస్తున్నది. అలాగే లీటర్ డీజిల్పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూ.1.80 కాగా మిగతావి ఇతర పన్నులు. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ కాంపొనెంట్ ఆధారంగా రూపొందించే ఫార్ములా ప్రకారం రాష్ర్టాలకు కేంద్రం నిధులు విదిలిస్తున్నది.