Air India | టాటా సన్స్ గ్రూప్ ఆధీనంలోని ఎయిర్లైన్స్ మధ్య సహకారం దిశగా తొలి అడుగు పడింది. ఎయిరిండియా (ఏఐ), ఏయిర్ ఏషియా ఇండియా (ఏఏఐపీఎల్) మధ్య పరస్పరం ప్రయాణికుల షేరింగ్ ఒప్పందం కుదిరింది. ఏదైనా కారణంతో ఒక సంస్థ సర్వీసుకు అంతరాయం కలిగితే, మరో విమానయాన సంస్థ సంబంధిత ప్రయాణికులను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం 2024 ఫిబ్రవరి తొమ్మిదో తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ మేరకు రెండు సంస్థల ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ఆల్టర్నేటివ్ విమాన సర్వీసులు అందుబాటులోకి తేవడమే ఈ ఒప్పందం ఉద్దేశం. అయితే ఏడేండ్ల ఏఏఐపీఎల్కు మాత్రం ఏదైనీ అంతర్జాతీయ విమాన సర్వీసు లేదు.
గత నెల 27వ తేదీన ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ను టాటా సన్స్ టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో టాటాసన్స్ ఆధీనంలో నాలుగు విమానయాన సంస్థలు ఉన్నాయి. ఎయిరిండియా విమాన సర్వీసుల టైం పెర్ఫార్మెన్స్ను మెరుగు పర్చాలని టాటా సన్స్ భావిస్తున్నది.
ఎయిర్ ఏషియా ఇండియా ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఎయిరిండియా విమాన ప్రయాణికులను తీసుకెళ్లాల్సి ఉంటుంది. సంబంధిత ఎయిర్ పోర్ట్ మేనేజర్ అనుమతి మేరకే ప్రయాణికులకు ఆల్టర్నేటివ్ విమాన సర్వీసు అందుబాటులో ఉంటుంది. సీట్ల లభ్యతను బట్టే ప్రయాణికులను అనుమతిస్తారు. ఎయిర్లైన్ బ్యాగేజీని అనుమతించాలంటే ట్రాన్సఫరింగ్ ఎయిర్లైన్స్ ఒరిజినల్ టికెట్ చూపాల్సి ఉంటుంది.