హైదరాబాద్, డిసెంబర్ 8: టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్..దక్షిణాదిలో మరింత పాగవేయడానికి కసరత్తును తీవ్రతరం చేసింది. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో తన వ్యాపారాన్ని విస్తరించిన సంస్థ..తాజాగా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో వ్యాపార విస్తరణకోసం భారీ స్థాయిలో శాఖలను ప్రారంభించబోతున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 100కి పైగా శాఖలను ఆరంభించగా, వచ్చే ఆరు నెలల్లో మరో 100 శాఖలను ప్రారంభించాలనుకుంటున్నట్లు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ నవీన్ తాహిల్యాని తెలిపారు. 2022 జూన్ నాటికి 415 శాఖలకు పెంచుకోవడంలో భాగంగా కొత్తగా ప్రారంభించేవాటిలో దక్షిణాదిలో అత్యధికమని ఆయన పేర్కొన్నారు. గతేడాదికాలంగా దేశవ్యాప్తంగా 100 శాఖలను ప్రారంభించిన సంస్థ..వీటిలో తెలంగాణలో 10, ఏపీల్లో 12 శాఖలను ఆరంభించింది. కంపెనీ మొత్తం వ్యాపారంలో తెలుగు రాష్ర్టాల వాటా 8 శాతంగా ఉన్నదని, వచ్చే ఏడాది రెండంకెలకు చేరుకునే అవకాశం ఉన్నదన్నారు. తెలంగాణలో రూ.125 కోట్ల వ్యాపారం చేసిన సంస్థ.. ఏపీల్లో రూ.60 కోట్లు వసూలయ్యాయి.
ఈ ఏడాది 30 శాతం వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 శాతం వృద్ధిని అంచనావేస్తున్నట్లు ఆయన చెప్పారు. 2020-21లో మొత్తం ప్రీమియం వసూళ్ళు ఏడాది ప్రాతిపదికన 34 శాతం పెరిగి రూ.11,105 కోట్లకు చేరుకున్నాయి. అలాగే వ్యాపార విస్తరణకోసం అవసరమైన సలహాదారులను గరిష్ఠ స్థాయిలో రిక్రూట్ చేసుకున్నది. 2020-21లో దేశవ్యాప్తంగా గతేడాది 2వేల మంది సలహాదారులను నియమించుకున్నది. దీంతో మొత్తం సంఖ్య 40 వేలకు చేరుకున్నారు. అలాగే ఈ ఏడాది ఇప్పటి వరకు 1,400 మందిని నియమించుకున్నది. వీరిలో ఒక హైదరాబాద్లోనే 600 మందిని రిక్రూట్ చేసుకున్నది.
రూ.480 కోట్ల సేకరణ
గడిచిన ఆర్థిక సంవత్సరంలో క్లెయింలు అత్యధిక స్థాయిలో ఉండటంతో సంస్థపై పెనుభారం పడిందని ఆయన చెప్పారు. గతేడాది రూ.870 కోట్ల విలువైన క్లెయింలు చేయగా, దీంట్లో సగం రూ.450 కోట్లు కరోనాకు సంబంధించినవేనని ఆయన స్పష్టంచేశారు. మరోవైపు ఈ లోటును భర్తిచేయడానికి త్వరలో రూ.480 కోట్ల నిధులను సమీకరించాలనుకుంటున్నట్లు చెప్పారు.