హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): పుట్టిన ఇద్దరు పిల్లలు మరణించారు. పది రోజుల క్రితం పుట్టిన మగబిడ్డ కూడా చావు అంచుల్లో ఉన్నాడు. పుట్టిన వారు పుట్టినట్టు మరణిస్తుంటే ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. పిల్లలు లేని జీవితం వృథా అనుకున్నారు. అంపశయ్యపై ఉన్న బిడ్డను దవాఖానలోనే వదిలేసి అక్కడే కనిపించిన ఆరు నెలల పసిబిడ్డను తీసుకుని వెళ్లిపోయారు. నాలుగు రోజుల తర్వాత ఆ దంపతులను పట్టుకున్న పోలీసులు మానవీయ కోణంలో స్పందించారు. చావుబతుకుల్లో ఉన్న వారి బిడ్డకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఎం వెంకటేశ్వర్లు బుధవారం సీసీఎస్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. గండిపేటకు చెందిన ఫరీదాబేగం ఈ నెల 14న తన ఆరు నెలల బిడ్డను నిలోఫర్ దవాఖానకు తీసుకొచ్చింది.. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో బిడ్డకు పాలిచ్చి పడుకోబెట్టి భోజనం కోసం బయటకు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి బాబు కనిపించకపోవడంతో నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.
పిల్లలు చనిపోతుండటం వల్లే
మమత-శ్రీను దంపతులకు ఇది వరకు ఇద్దరు మగపిల్లలు పుట్టి జన్యు సంబంధిత వ్యాధులతో చనిపోయారు. పది రోజుల క్రితం మరో మగబిడ్డ జన్మించినా అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో చికిత్స కోసం నిలోఫర్కు తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు భరోసా ఇవ్వకపోవడంతో కుమిలిపోయారు. బిడ్డలు లేకుండా జీవించడం సాధ్యం కాదని భావించారు. అదే సమయంలో దవాఖానలో ఒంటరిగా కనిపించిన ఓ చిన్నారి తమను చూసి నవ్వడంతో అతడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. నిందితులు కిడ్నాప్ చేసింది డబ్బు కోసమో, అమ్ముకోవడానికో కాదని.. తమకు పుట్టినవారు చనిపోతుండడంతో ఈ బిడ్డను పెంచుకోవాలనే అమాయకత్వంతో వారు కిడ్నాపర్లుగా మారారని డీసీపీ తెలిపారు. మమత దంపతులకు పుట్టిన ఇద్దరు మగబిడ్డలు హైపర్ విస్కోసిటీ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధితో చనిపోయినట్టు పేర్కొన్నారు. ఇది మగపిల్లలకే సోకే వ్యాధి అని తెలిపారు. ప్రస్తుతం నిలోపర్ దవాఖానలో ఉన్న మూడో బిడ్డ కూడా అదే వ్యాధితో బాధపడుతున్నాడని, వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. కేసును ఛేదించిన పోలీసులను అభినందించిన డీసీపీ.. సీపీ తరపున రివార్డులు అందజేస్తామని తెలిపారు.
ప్రత్యేక బృందాలతో గాలింపు
ఫిర్యాదు అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. దాదాపు 100కుపైగా సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేశారు. చివరికి కిడ్నాపర్లు ఆటోలో జూబ్లీ బస్స్టేషన్కు, అక్కడి నుంచి బస్సులో నిజామాబాద్ వెళ్లినట్టు గుర్తించారు. మంగళవారం సాయంత్రం నిందితులను కామారెడ్డి జిల్లాలోని కోతబడి తండాలో అదుపులోకి తీసుకున్నారు. వారిని కాతరోత మమత-శ్రీను దంపతులుగా గుర్తించి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఐదు రోజులుగా బాలుడికి మమత పాలిస్తుండడంతో బాలుడు ఆరోగ్యంగానే ఉన్నట్టు డీసీపీ తెలిపారు.నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.