శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణంతోపాటు పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్లాస్టిక్ వాడకాన్ని బహిష్కరించి స్వచ్ఛ్ శ్రీశైలం దిశగా ముందుకెళ్లాలని ఈవో లవన్న పిలుపునిచ్చారు. మంగళవారం పరిపాలన విభాగంలో ఈవో ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో హైదరాబాద్కు చెందిన ఎకోలాస్టిక్ ప్రతినిధులు ప్లాస్టిక్ కవర్ల వాడకం వల్ల ఎదురయ్యే సమస్యలు, నష్టాలను స్థానిక ప్రజలు, వ్యాపారులు, హోటళ్ల యజమానులు, నిత్యాన్నదాన సత్ర నిర్వాహకులకు వివరించారు.
ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యమ్నాయంగా కంపోజబుల్, జ్యూట్, బట్టతో తయారైన బ్యాగులను వాడడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని, మూగజీవాలకు హాని కలగకుండా భావితరాల భవిష్యత్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. యాత్రికులు, వ్యాపారుల సమిష్టి కృషితోనే శ్రీశైలాన్ని స్వఛ్ శ్రీశైలంగా మార్చగలమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైలంలో కంపోజబుల్ బ్యాగులను వినియోగించాలని, అందుకోసం దేవస్థానం వారు వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి ధృడ నిశ్చయంతో ఉన్నామని ఈవో తెలిపారు.
శ్రీశైలంలో హోటళ్లు, దుకాణాల నిర్వాహకులు, స్థానిక ప్రజలతో పాటు క్షేత్రానికి వచ్చే యాత్రికులు ఎవరికి వారు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించాలని ఆయన కోరారు. వైద్యశాలలో బ్యాండేజ్, ఔషధ వ్యర్థాల సర్జికల్ వేస్ట్ వంటి వాటిని వేరువేరుగా ఉంచాలన్నారు. అవగాహన సదస్సులో ఈఈ మురళీ బాలకృష్ణ, ఏసీ నటరాజ్, ఏఈవోలు హరిదాస్, ఫణీంధ్ర ప్రసాద్, డీఈలు శ్రీనివాస్ రెడ్డి, నర్సింహరెడ్డి, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్ కుమార్, పర్యవేక్షకులు శ్రీహరి, శివప్రసాద్లతో పాటు స్థానిక వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు.