హైదరాబాద్, ఆట ప్రతినిధి: కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (59 బంతుల్లో 97 నాటౌట్; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) దంచికొట్టడంతో దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం గ్రూప్-ఈలో భాగంగా ఉత్తరాఖండ్తో జరిగిన పోరులో హైదరాబాద్ 61 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఓపెనర్ తన్మయ్ శతకానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఉత్తరాఖండ్ 18.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్ 5 వికెట్లు తీశాడు.