చెన్నై, ఏప్రిల్ 6: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూపొందించిన జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభు త్వం, అసాధారణ నిర్ణయం తీసుకొన్నది. తమ రాష్ర్టానికి సొం తంగా విద్యావిధానాన్ని రూపొందించుకొనేందుకు సీఎం స్టాలిన్ ప్రత్యేక కమిటీ వేశారు. హిందీ వ్యతిరేకోద్యమానికి కేంద్ర బిందువైన తమిళనాడులో ఎన్ఈపీపై మొదటి నుంచీ తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఎన్ఈపీ ద్వారా దొడ్డిదారిన తమ రాష్ట్రంలో హిందీని ప్రవేశపెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని 2019 నుంచీ డీఎంకే ఆరోపిస్తున్నది. ఇప్పుడు అధికారంలోకి రావటంతో సొంత విద్యా విధానం (ఎస్ఈపీ) కోసం 13 మందితో కమిటీని నియమించింది. చెస్ ప్రపంచ మాజీ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, కర్ణాటక సంగీత విద్వాంసుడు టీఎం క్రిష్ణతోపాటు ప్రముఖ ప్రొఫెసర్లు, హెడ్మాస్టర్లు కమిటీలో ఉన్నారు.
సొంత ఎస్ఈపీ ఎందుకు?
తమిళనాడులో సొంత విద్యావిధానం రూపకల్పనకు హిందీ వ్యతిరేకతే ప్రధాన గా కనిపిస్తున్నప్పటికీ ఇంకా అనేక అంశాలు దీని వెనుక ఉన్నాయని నిపుణులు అంటున్నారు. దేశమంతా త్రిభాషా సూత్రం అమలవుతుండగా తమిళనాడులో హిందీని తిరస్కరించి 1968 నుంచి తమిళం, ఇంగ్లిష్తో ద్విభాషా సూత్రాన్ని అమలు చేస్తున్నారు. హిందీ వ్యతిరేకత ద్రవిడ రాజకీయాల్లో మొదటి నుంచీ కీలకమైన అంశంగా ఉంటున్నందున సహజంగానే ఎన్ఈపీపై వ్యతిరేకత పెల్లుబికింది. ఎన్ఈపీలో రాష్ర్టాల అవసరాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని మొదటినుంచీ ఆరోపణలు ఉన్నాయి. ఇది కూడా స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవటానికి ఒక కారణం. ఎన్ఈపీలో మూడు, ఐదు, ఎనిమిదో తరగతులకు కూడా పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని ప్రతిపాదించారు. దీనివల్ల డ్రాపౌట్స్ పెరిగి విద్య ప్రైవేటీకరణకు దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
సీయూఈటీ.. తిరోగమన చర్య: స్టాలిన్
చెన్నై, ఏప్రిల్ 6: కేంద్రీయ వర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు(సీయూఈటీ) విద్యాపరంగా ‘తిరోగమన చర్య’ అని తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శించారు. నీట్కు, సీయూఈటీకి ఏం తేడా లేదన్నారు. ‘ఎన్సీఈఆర్టీ సిలబస్తో నిర్వహించే ఏ ప్రవేశపరీక్ష అయినా అది విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించదు’ అని స్టాలిన్ పునరుద్ఘాటించారు. సీయూఈటీని ఉపసంహరించుకోవాలని ప్రధాని మోదీని కోరారు. కేంద్రీయ వర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు కేవలం సీయూఈటీ స్కోరునే పరిగణనలోకి తీసుకోవాలని యూజీసీ అన్ని సెంట్రల్ వర్సిటీలకు లేఖ రాసింది.