చెన్నై : తమిళనాడు ప్రభుత్వం జూలై 5వ తేదీ వరకు లాక్డౌన్ను పొడగించింది. రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. అదే సమయంలో మూడు జిల్లాలకు ప్రత్యేకంగా సడలింపులు ఇచ్చింది. యాక్టివ్ కేసుల ఆధారంగా రాష్ట్రంలోని 38 జిల్లాలను మూడు కేటగిరీలుగా ప్రభుత్వం విభజించింది. మొదటి కేటగిరిలో 11 హాట్స్పాట్ జిల్లాలు ఉన్నాయి. రెండో కేటగిరిలో తక్కువ యాక్టివ్ కేసులున్న జిల్లాల్లో 23 ఉన్నాయి. మూడో కేటగిరిలో చెన్నై సహా పొరుగున ఉన్న మూడు జిల్లాలను చేర్చింది. ఇక్కడ కరోనా తీవ్రత గణనీయంగా మెరుగుపడింది. ఈ మేరకు సీఎం ఎంకే స్టాలిన్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు చెన్నై, పొరుగు జిల్లాలైన తిరువల్లూరు, కాంచీపురం, చెంగల్పట్టుల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాల్స్ తెరిచి ఉండేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆయా జిల్లాల్లో వస్త్ర, ఆభరణాల దుకాణాలను తెరిచేందుకు అనుమతి జారీ చేసింది. 50 శాతం సామర్థ్యంతో పని చేయొచ్చని, ఎయిర్ కండీషనర్లను ఉపయోగించొద్దని ఆదేశించింది.
రెస్టారెంట్లలో పార్సిల్ సేవలకు అనుమతి ఇవ్వగా.. మాల్స్, సినిమా థియేటర్లు మూసి ఉండనున్నాయి. ఆయా జిల్లాల్లో ఇంతకు ముందు తెరిచేందుకు అనుమతి ఇచ్చిన దుకాణాలు సైతం రాత్రి 9 గంటల వరకు పని చేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. నాలుగు జిల్లాల్లో, కొవిడ్ ప్రోటోకాల్తో దేవాలయాలు, చర్చిలు, మసీదులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఆయా జిల్లాల్లోని ప్రైవేటు కార్యాలయాలకు ప్రభుత్వం పూర్తి హాజరును అనుమతిచ్చింది. కోయంబత్తూరుతో సహా 11 జిల్లాల్లో ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఆయా జిల్లాల్లో బ్యాంకులు, బీమా సంస్థలు 50శాతం సిబ్బందితో పని చేయనున్నాయి. ఈ 23 జిల్లాల్లో, పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, పర్యాటక ప్రాంతాల్లోకి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. శుక్రవారం తమిళనాడులో 5,755 కొత్త కొవిడ్ కేసులు, 150 మరణాలు నమోదయ్యాయి.