న్యూఢిల్లీ : తాలిబన్.. ప్రస్తుతం ప్రపంచాన్నే భయాందోళనకు గురి చేస్తున్న పదం. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేపట్టేందుకు తహతహలాడుతున్న ఉగ్రవాద మూక. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఆఫ్ఘన్లో మళ్లీ తాలిబన్ శకం మొదలుకానుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మధ్యప్రాశ్చ దేశంలో ముఖ్యంగా మహిళల భవిష్యత్, భద్రతకే ముప్పు పొంచి ఉన్నది. ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్, యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. యూరోపియన్తో పాటు 20 దేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఇందులో మహిళలకు హక్కులు, స్వేచ్ఛకు భరోసా ఇవ్వాలని తాలిబన్లకు సూచించాయి. దేశాన్ని తమ ఆధీనంలో తీసుకున్న తర్వాత షరియా చట్టం ప్రకారం.. మహిళలకు ‘స్వేచ్ఛ’ ఇస్తామని తాలిబన్లు హామీ ఇచ్చారు. మహిళలు ఉద్యోగాలు చేసుకోవచ్చని.. ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్పారు. వారి గత పాలన చరిత్రను పరిశీలిస్తే.. ఇచ్చిన హామీలను నమ్మడం కష్టమే. తొలుత మహిళల విషయంలో తాలిబన్ల మాటలు కాస్త ఉదారంగా కనిపించినప్పటికీ.. ప్రస్తుతం వాస్తవ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నది.
దేశాన్ని ఆక్రమించిన తర్వాత తాలిబన్లు చెప్పిన మాటలకు.. వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండడం లేదు. విధుల కోసం వెళ్లిన ఆఫ్ఘనిస్తాన్ టీవీ జర్నలిస్ట్ షబ్నం ఖాన్ దావ్రాన్కు తాలిబన్ల నుంచి ఛేదు అనుభవం ఎదురైంది. తనను కార్యాలయంలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని ఆమె సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చెప్పారు. కేవలం పురుష జర్నలిస్టులను మాత్రమే అనుమతించారని, తన ఐడీ కార్డ్ చూపినా.. అనుమతించలేదని చెప్పారు. తాలిబన్లు ఆఫ్గన్ను ఆక్రమించుకోవడంతో వ్యవస్థ మారిపోయిందని.. మహిళా జర్నలిస్టులను అనుమతించట్లేదని చెప్పినట్లు తెలిపారు. ‘నా మాటలు వింటున్నవారు.. ఒకవేళ ప్రపంచం నా మాటలు వింటుంటే.. దయచేసి మాకు సహాయం చేయండి.. మేం ఆపదలో ఉన్నాం.. మా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది’ అని షబ్నమ్ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకు ముందు సైతం అమెరికన్ మీడియా హౌస్ సీఎన్ఎన్ చీఫ్ ఇంటర్నేషనల్ రిపోర్టర్ క్లారిస్సా వార్డ్ సైతం హిజాబ్లో కనిపించారు. ఇదిలా ఉండగా.. దేశంలో 15-45 సంత్సరాల మధ్య వయసున్న ఒంటరి మహిళలు, వితంతువుల జాబితా ఇవ్వాలని కోరినట్లు సమాచారం. వారిని తాలిబన్ యోధులు వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో మహిళలు బలవంతంగా బురఖా ధరించడంతో పాటు ఉద్యోగాలకు వెళ్లే మహిళల భయంతో కార్యాలయాలకు వెళ్లడం మానేశారు.
ఆఫ్ఘనిస్తాన్లో 2001కి ముందు ఆఫ్ఘన్లో తాలిబన్ల పాలనలో చోటుచేసుకున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలపై విపరీతంగా పన్నులు వేయడం, డబ్బుల కోసం కిడ్నాప్లకు పాల్పడ్డ సంఘటనలూ ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు తీవ్రమైన అఘాయిత్యాలకు గురయ్యారు. రెండో తరగతి పౌరులుగా పరిగణించారు. బాలికలకు కనీసం చదువుకునేందుకు సైతం అనుమతి ఇవ్వలేదు. ఆఫీసుల్లో పని చేయడంపై నిషేధం విధించారు. తప్పనిసరిగా బురఖా ధరించి వెళ్లేలా కఠిన ఆంక్షలు అమలు చేశారు. కనీసం ఇంటి బాల్కనీలోకి రావడం, ఇంటి టెర్రస్పైకి వెళ్లడం సైతం నిషేధం విధించారు. కుటుంబంలోని మగ తోడు లేకుండా ఒంటిరిగా బయటకు వెళ్లడం నిషేధించారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై దాడులకు తెగబడ్డారు.
ఈజిప్ట్లో.. : చట్టం ముందు అందరూ సమానమేనని.. ప్రస్తుత ఈజిప్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 40, 46 స్పష్టంగా పేర్కొన్నాయి. జాతి, భాష, మతం తదితర వివక్ష లేకుండా అందరికీ హక్కులున్నాయి. అదే రాజ్యాంగంలోని రెండో ఆర్టికల్ ప్రకారం.. ‘ఇస్లాం రాష్ట్ర మతం. ఇస్లామిక్ షరియా సూత్రాలు చట్టానికి ప్రధాన మూలం’. ఈ చట్టం మేరకు మహిళలు హిజాబ్ ధరించడం, తలను కప్పుకోవడం తప్పనిసరి. సామాజిక, మతపరమైన ఒత్తిళ్ల కారణంగా మహిళలు ముసుగులు లేకుండా బహిరంగంగా బయటకు వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. 2008లో ఈజిప్ట్లో సున్తీపై పూర్తి నిషేధం విధించినప్పటికీ.. దేశంలో ఇంకా నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నది. ఇక్కడ మహిళలకు ఉపాధి అవకాశాలు చాలా తక్కువే. పేదరికం ఎక్కువగా ఉన్న దేశాల్లో మహిళలకు ఉద్యోగ అవకాశాలూ తక్కువే. ప్రపంచబ్యాంకు 2004లో నిర్వహించిన అధ్యయనంలో మధ్యప్రాచ్యంలోని మహిళలు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో వారి పురుషులతో సమానంగా పని చేస్తే.. మధ్యస్థ కుటుంబ ఆదాయం 20 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేసింది.
దాదాపు 25 శాతానికి ఉండొచ్చని.. తద్వారా పేదరికం నుంచి కుటుంబాలను బయటపడేయగలదని పేర్కొంది. దేశంలో మహిళలు పలు రంగాల్లో హింసకు గురవుతున్న నేపథ్యంలో పని చేసేందుకు ఇష్టపడడం లేదు. 2013లో ఐక్యరాజ్య సమితి సర్వే ఈజిప్ట్లో 99.3 శాతం మంది మహిళలు ఏదో ఒక సమయంలో వేధింపులకు గురయ్యారని పేర్కొంది. లైంగిక నేరాలకు వ్యతిరేకంగా కొత్త చట్టాన్ని ఈజిప్ట్ పార్లమెంట్ ఆమోదించింది. అయితే, ఇటీవల దేశం లింగ సమానత్వంలో కొంత పురోగతిని సాధించింది. బాలికలు, బాలురు ప్రస్తుతం సమానంగా పాఠశాలలకు హాజరవుతున్నారు. ఈజిప్ట్ విశ్వవిద్యాలయాల్లో పురుష పట్టభద్రుల కంటే ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. యువతులు ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు తక్కువ మంది పిల్లలు ఉన్నారు. అలాగే ఈజిప్ట్లో మూడింట ఒక వంతు మహిళలు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రాచీన ఈజిప్షియన్ నాగరికతలో పురుషుల కంటే మహిళలకు ఎక్కువ హక్కులున్నాయని చెబుతారు. 2500 స౦వత్సరాల క్రిత౦ ఈజిప్జ్ సమాజ౦లోని స్త్రీలు మరి౦త సమర్థులుగా ఉన్నారని ఒక పరిశోధనలో తేలింది.
ఇరాన్లో మహిళలు, బాలికలు రెండో తరగతి పౌరులుగా పరిగణించబడుతున్నారని ఐక్యరాజ్య సమితి నిపుణుడు జావేద్ రెహమాన్ మానవ హక్కుల మండలికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఆయన తన నివేదికలో ప్రతి ఏటా 10-14 సంవత్సరాల మధ్య వేలాది మంది బాలికలకు వివాహాలు జరుగుతున్నాయన్నారు. బాలికల, మహిళల హక్కులు కాలరాస్తుండడంతో బాల్య వివాహాలు కొనసాగుతున్నట్లు చెప్పారు. నివేదిక ప్రకారం.. ఇరానియన్ చట్టం, ఆచరణలో మహిళలపై స్పష్టమైన వివక్ష తెలుస్తోంది. వివాహం, విడాకులు, ఉద్యోగాలు, సంస్కృతితో సహా జీవితంలోని ప్రతి అంశాల్లోనూ మహిళలు ఆంక్షలకు లోబడే ఉంటారు. వారు వేసే ప్రతి అడుగూ భర్త, తండ్రి నుంచి అనుమతి తప్పనిసరి. ఇరాన్లో భర్త తన భార్య దేశ పౌర నియమావళిని ప్రవర్తించడం లేదని భావిస్తే ఆమెను పని చేయకుండా అడ్డుకోవచ్చు.
అలాగే భార్య అంతర్జాతీయ ప్రయాణాలు చేయకుండా నిషేధించొచ్చు. కార్యాలయాల్లో సమాన ప్రాతినిథ్యం ఇప్పటికీ అమలు కావడం లేదు. హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకారం, ప్రతి సంవత్సరం 50 శాతం మంది బాలికలు విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులవుతున్నారు. అయినప్పటికీ మహిళలు శ్రామిక శక్తిలో 17శాతమే ఉన్నారు. అయితే, రాజకీయంగా మహిళలకు అనుకూలంగా కొన్ని సానుకూల చర్యలు తీసుకున్నారు. ఇంతకు ముందు ఇరాన్లో మహిళా అధ్యక్షురాలిగా ఉండేందుకు అనుమతి లేకపోగా.. అభ్యర్థిత్వం సైతం చట్టవిరుద్ధంగా పరిగణించే వారు. కానీ, ప్రస్తుతం వారికి ఈ విషయంలో హక్కులు లభించగా.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఇప్పటికే మహిళలు ఉన్నది.
మహిళలకు డ్రైవింగ్ హక్కు ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా వార్తలో నిలిచింది సౌదీ అరేబియా. మహిళలకు హక్కులు, స్వేచ్ఛ ఇవ్వాలనే నిర్ణయం క్రౌన్ ప్రిన్స్ మొమహ్మద్ బిన్ సల్మాన్ ‘విజన్-2030’లో భాగమని పేర్కొంది. మహిళలకు సైనిక, గూఢచార సేవల్లో చేరేందుకు అవకాశం ఇచ్చింది. కానీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం జెండర్ సూచికలో వాస్తవాలు మరోలా ఉన్నాయి. ఇండెక్స్లోని 144 దేశాల్లో సౌదీ అరేబియా 138వ స్థానంలో ఉన్నది. ఈ గల్ఫ్ దేశంలో మహిళలు తమ మగ సంరక్షకుల అనుమతి లేకుండా కనీసం బ్యాంకు ఖాతా తెరువలేని పరిస్థితి ఉన్నది. సౌదీ మహిళలు పాస్పోర్ట్ పొందేందుకు, దేశం విడిచి వెళ్లేందుకు పురుష సంరక్షకుల అనుమతి తప్పనిసరి. రెస్టారెంట్లో పురుషులతో కూర్చునేందుకు సైతం మహిళలకు అనుమతి లేదు. వివాహం.. విడాకుల వరకు అన్నీ మగవారి దయపైనే ఆధారపడాల్సిందే. అయితే, ఇక్కడ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖాలను కప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ, వదులుగా ఉండే, పూర్తి శరీరాన్ని కప్పేలా దుస్తులు ధరించాల్సి ఉంటుంది. ఈ దుస్తులను ‘అబయ’ అని పిలుస్తుంటారు. నియమాలు పాటించకుంటే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సౌదీలో మహిళలకు 2015లో ఓటుహక్కు లభించింది. కొన్నేళ్ల తర్వాత ఓ మహిళ మంత్రి అయ్యారు.