కాబూల్ : ఆఫ్ఘన్ను ఆక్రమించిన తాలిబన్లు మంగళవారం తాతాల్కిక ప్రభుత్వాన్ని ప్రకటించారు. తాలిబన్ల శక్తివంతమైన నిర్ణయాలు తీసుకునే సంస్థ ‘రెహ్బరీ షురా’ సంస్థ కొత్త ప్రభుత్వానికి ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్ తాతాల్కిక ప్రధానిగా నియమించింది. తాలిబన్ సహ వ్యవహస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరదార్, మౌలావి హనాఫీ డెప్యూటీ నేతలుగా ఉంటారని.. తాలిబన్ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. కొత్త ప్రభుత్వం రెహ్బరీ షురా సంస్థ అధిపతి ఆధ్వర్యంలో వ్యవహారాలన్నింటిని ప్రభుత్వం నడిపించనుంది.
అలాగే, సారాజుద్దీన్ హక్కానీని తాత్కాలిక ఇంటీరియర్ మంత్రిగా, తాలిబాన్ అధికార ప్రతినిధి అబాస్ స్టానిక్జాయ్ కొత్త ఆఫ్ఘన్ ప్రభుత్వంలో ఉప విదేశాంగ మంత్రిగా వ్యవహరించనున్నట్లు ముజాహిద్ తెలిపారు. ముల్లా యాకూబ్ కొత్త ఆఫ్ఘన్ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా నియామకమవగా.. అమీర్ ఖాన్ ముత్తాకీని విదేశాంగ మంత్రిగా నియమించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. అమెరికా దళాలు ఆఫ్ఘాన్ను వీడుతున్న క్రమంలో ఆగస్ట్ 15న కాబుల్ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు 20 రోజుల తర్వాత ప్రభుత్వ ఎట్టకేలకు తాలిబన్లు ప్రకటన విడుదల చేశారు.
గతవారమే ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబన్లు ప్రకటన చేయాల్సి ఉంది. పలు కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాత్కాలిక ప్రభుత్వంలో 20 సంవత్సరాలు పాటు, అమెరికా, దాని మిత్రదేశాలపై నిర్విరామంగా పోరాటం చేసిన వారికి తాలిబన్లు ప్రభుత్వంలో పెద్దపీట వేశారు. అపద్ధర్మ ప్రధాని ముల్లా హసన్ అఖుంద్ నేతృత్వంలో పాలన సాగనుండగా.. 2001లో తాలిబన్ల ప్రభుత్వం కుప్పకూలిన సమయంలోనూ ఈయనే ప్రధానిగా ఉండడం గమనార్హం. మరోవైపు అమెరికా బలగాల ఉపసంహరణ ఒప్పందంపై చర్చలు సాగించిన, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ కేబినెట్లో ఉప ప్రధాని బాధ్యతలను అప్పగించారు.