శామీర్పేట/పీర్జాదిగూడ, జనవరి 20 : కొవిడ్-19 నుంచి సురక్షితంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని తూంకుంట మున్సిపాలిటీ చైర్మన్ కారంగుల రాజేశ్వర్రావు అన్నారు. గురువారం ఆరోగ్య కేంద్రంలో బూస్టర్ డోస్ తీసుకున్నారు. కొవిడ్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటేషన్ చేసుకోవడం వంటి నిబంధనలు పాటించాలన్నారు. మొదటి, రెండవ డోసులు తీసుకున్న ప్రజలు బూస్టర్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. శామీర్పేట, మూడుచింతలపల్లి పీహెచ్సీ సెంటర్లలో మొత్తం 135 మందికి టీకా వేశారని వైద్యాధికారులు తెలిపారు.
కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్
పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ ప్రతిభ ఆధ్వర్యంలో గురువారం 400 మందికి మొదటి, రెండవ డోస్ టీకాలు వేశామని తెలిపారు.