Ramagundam | కోల్ సిటీ, ఏప్రిల్ 24 : ‘ఖాళీ స్థలాలు, కాలువల్లో చెత్త బయట వేసే వారి ఫొటోలు తీసి మున్సిపాలిటికి పంపించండి’ అని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి ప్రజలకు సూచించారు. ఈమేరకు శుక్రవారం 36వ డివిజన్ గాంధీనగర్ లో స్థానిక కార్పొరేటర్ కల్వల పద్మావతితో కలిసి పర్యటించారు. డివిజన్లోని పరిసర ప్రాంతాలు, మురికి కాలువలను పరిశీలించారు. నగర అభివృద్ధికి అవరోధంగా పరిణమించిన చెత్తను ఏరివేస్తామనీ, ఇందుకు ప్రజలు సహకరించాలన్నారు.
ఇరుకు వీధుల కారణంగా చెత్త సేకరించడానికి ఆటో ట్రాలీ, ప్రాణాంతక పరిస్థితిలో అంబులెన్సు రాకుండా ఉన్నందున ఇళ్ల ముందు నిర్మించుకున్న గద్దెలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేదంటే తామే తొలగిస్తామని హెచ్చరించారు. కాలువల్లో చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాలకు అప్పగించాలన్నారు.
ఎవరైనా చెత్త కాలువల్లో గానీ బయట గానీ పడేసినా, కాల్చినా సామాజిక బాధ్యతగా ఇతరులు ఫొటో తీసి మున్సిపాలిటీకి పంపిస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఎస్ఈ గురువీర, ఈఈ పీవీ రామన్, డీఈలు ఆస్లాబ్, జగదీష్, ఏఈలు అన్వేష్, టీపీఎస్ నవీన్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.