మందమర్రి, మే 1: పట్టువీడకుండా చేసే ప్రయత్నమే భవిష్యత్తును నిలబెడుతుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సీఐఎస్ఎఫ్ బ్యారెక్స్లో బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కోచింగ్ సెంటర్ను ఆదివారం శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, ప్రొఫెసర్ సంకశాల మల్లేశం, రామగుండం సీపీ చంద్రశేఖర్రెడ్డితో కలిసి ప్రారంభించారు.
అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న నేపథ్యంలో యువతకు ఉపయోగపడేలా శిక్షణ కేంద్రం ప్రారంభించినట్టు చెప్పారు. ఇక్కడ శిక్షణతోపాటు ఉచితంగా స్టడీ మెటీరియల్, మ ధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించినట్టు వెల్లడించారు. చెన్నూర్, మందమర్రిలో రెండు సెంటర్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. దూర ప్రాంత అభ్యర్థుల కోసం బస్సు సౌకర్యం కల్పించినట్టు చెప్పారు. నియోజకవర్గంలోని యువతీయువకులు కోచింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉద్యోగార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు.