బంజారాహిల్స్, నవంబర్ 30: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులంతా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న ఈ-శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుని ప్రయోజనం పొందాలని హైదరాబాద్ జిల్లా కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ శ్యామ్ సుందర్రాజ్ సూచించారు. ఫిలింనగర్లోని భగత్సింగ్ కాలనీలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ-శ్రమ్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్రాజ్ మాట్లాడుతూ.. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులతో పాటు ఇండ్లలో పనిచేస్తున్న వారికి, హోటల్స్లో పనిచేసేవారికి, డ్రైవర్లు, కూలీలతో సహా అనేక వృత్తుల్లో ఉన్న వారికి బీమా సౌకర్యం ఉంటుందని, ఈ శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుంటే వారికి గుర్తింపు కార్డులు వస్తాయని వివరించారు. ఈ-శ్రమ్ కార్డులు ఉన్న వారికి ఏదైనా ప్రమాదవశాత్తు అంగవైకల్యం ఏర్పడితే రూ.1లక్ష, మరణం సంభవిస్తే రూ.2లక్షలు కుటుంబ సభ్యులకు అందుతాయని పేర్కొన్నారు. 18 ఏండ్లు నిండినవారంతా ఈ సౌకర్యం పొందాలన్నారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్, కార్మికశాఖ అధికారులు సత్యనారాయణ, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.