PV Sindhu | లక్నో: తెలుగమ్మాయి, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు రెండేండ్ల బీడబ్ల్యూఎఫ్ టైటిల్ నిరీక్షణకు ఎట్టకేలకు తెరదించింది. స్వదేశంలో జరిగిన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్లో ఆమె టైటిల్ గెలిచింది. లక్నో వేదికగా ముగిసిన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు.. 21-14, 21-16తో వు లు యు (చైనా)పై గెలిచింది. తద్వారా ఆమె ఈ టోర్నీని మూడుసార్లు నెగ్గినైట్టెంది. 2017, 2022లోనూ ఆమె ఈ టోర్నీలో విజేతగా గెలిచింది. గతంలో సైనా నెహ్వాల్ మాత్రమే ఈ టోర్నీలో మూడుసార్లు విజేతగా నిలవగా తాజాగా సింధు ఆమె రికార్డును సమం చేసింది. సింధూతో పాటు పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్, మహిళల డబుల్స్లో త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్ ద్వయం టైటిల్స్ను సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్.. 21-6, 21-7తో జియా హెంగ్ జేసన్ (సింగపూర్)పై అలవోక విజయం సాధించాడు. మహిళల డబుల్స్లో త్రిసా-గాయత్రి జోడీ.. 21-18, 21-11తో బావో లి జింగ్-లీ కియూన్ (చైనా)ను చిత్తు చేసి తొలిసారి సూపర్ 300 టైటిల్ను కైవసం చేసుకుంది.
గత రెండేండ్లుగా బీడబ్ల్యూఎఫ్ టైటిల్ వేటలో ఉన్న సింధు.. ఈ టోర్నీ ఆసాంతం అదరగొట్టింది. ఇరా శర్మ, ఉన్నతి హుడా వంటి యువ భారత షట్లర్లు ఆమెకు కఠిన పోటీనిచ్చినా వారిని అధిగమిస్తూ ఫైనల్ చేరింది. తుదిపోరులో ఆమె.. తొలి గేమ్ బ్రేక్ సమయానికి 11-9తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత ఆమె జోరు పెంచి గేమ్ను సొంతం చేసుకుంది. కానీ రెండో గేమ్లో చైనా అమ్మాయి పుంజుకునేందుకు యత్నించింది. ఒకదశలో వు.. 11-10తో ఆధిక్యంలో ఉన్నా సింధు గేర్ మార్చింది. వు చేసిన తప్పిదాలను పసిగట్టిన ఆమె.. తనదైన స్మాష్లు, ఫోర్హ్యాండ్ షాట్లతో విరుచుకుపడి మ్యాచ్ను సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా పలు టోర్నీలలో సెమీస్కు చేరిన సింధు.. కీలక మ్యాచ్లలో విఫలమైనా ఈ టోర్నీలో మాత్రం ఆ తప్పులను పునరావృతం కాకుండా చూసుకుంది.
ఇక పురుషుల సింగిల్స్ ఫైనల్స్లో లక్ష్యసేన్ దుమ్మురేపాడు. సేన్ దూకుడుకు ప్రత్యర్థి నుంచి కనీస ప్రతిఘటన కూడా ఎదురుకాలేదు. మ్యాచ్ ఆద్యంతం అతడిదే ఆధిపత్యం. రెండు గేమ్స్లోనూ ప్రత్యర్థి 5 పాయింట్లు కూడా చేరకుండానే సేన్ విజయం దాదాపు ఖరారైంది.
పురుషుల, మహిళల సింగిల్స్, మహిళల డబుల్స్లో అదరగొట్టిన భారత్కు మిక్స్డ్ డబుల్స్తో పాటు పురుషుల డబుల్స్లో నిరాశ ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్లో తనీషా క్రాస్టో-ధ్రువ్ కపిల్ జంట.. 21-18, 14-21, 8-21తో డెచాపొల్-సుపిస్సర (థాయ్లాండ్) చేతిలో పరాభవం పాలై రన్నరప్తో సరిపెట్టుకున్నారు. పురుషుల డబుల్స్లో పృథ్వీ కృష్ణమూర్తి-సాయి ప్రతీక్ ద్వయం.. 14-21, 21-19, 17-21 తో హువాంగ్ డి – లియు యాంగ్ (చైనా) చేతిలో ఓడింది.