సూర్యాపేటసిటీ, మార్చి 10 : కేసుల దర్యాప్తులో పోలీసు సిబ్బంది సాంకేతికతను వినియోగించుకోవాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూచించారు. డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాల మేరకు ఎస్హెచ్ఓ, ఐఓ, టెక్ టీమ్ పని విభాగాలపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎస్హెచ్ఓ బాధ్యతలు, కేసుల దర్యాప్తు, కేసుల ఛేదనకు అవసరమయ్యే మెళకువలను తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు పెంచాలని, గతంలో ఏర్పాటు చేసిన కెమెరాలను ఆధునీకరించాలన్నారు. వీటిని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. కేసులు సుదీర్ఘంగా పెండింగ్లో ఉండకుండా త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. ప్రజలతో మమేకమై పని చేయాలని పేర్కొన్నారు.
సౌకర్యాలకు అనుగుణంగా సేవలు అందించాలి
పోలీసు సిబ్బందికి సౌకర్యాలు పెరిగాయని అదే స్థాయిలో ప్రజలకు సేవలు అందించాలని పెట్రోకార్ సిబ్బందికి ఎస్పీ సూచించారు. జిల్లా పోలీసు మోటార్ ట్రాన్స్పోర్టులో పెట్రోకార్ నిర్వహణ, అందించే సేవలను తనిఖీ చేసి మాట్లాడారు. ప్రజలకు అత్యంత చేరువగా ఉండే ఉద్ధేశంతో డీజీపీ ప్రత్యేక చోరవతో ఈ పెట్రోకార్ వాహనాలు అందించినట్లు, వసతులను సద్వినియోగం చేసుకొని నాణ్యమైన సేవలను అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రితీరాజ్, ట్రాన్స్పోర్టు అధికారి శ్రీనివాస్, పెట్రోకార్ సిబ్బంది పాల్గొన్నారు.