ఏ వీధి చూసినా, ఏ రోడ్డు చూసినా పచ్చని చెట్లు దర్శనమిస్తున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి. స్థానికులు, ప్రయాణికులకు ఆహ్లాదం పంచుతున్నాయి. ప్రకృతి చెంత సేదతీరుతూ ఎంతో మంది ఉపశమనం పొందుతున్నారు.
10 కిలోమీటర్లు.. 10వేల మొక్కలు
సూర్యాపేట రూరల్, అక్టోబర్ 22 : గతంలో సూర్యాపేట – జనగాం రహదారి పెద్ద వృక్షాలతో ప్రయాణికులకు ఆహ్లాద వాతావరణం అందించేది. రోడ్డు విస్తరణలో ఆ చెట్లను తొలగించగా రాష్ట్ర ప్రభుత్వం వాటి స్థానంలో కొత్తవి నాటాలని సంకల్పించింది. ఆ రోడ్డు పనులు పూర్తికాగా జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదినం సందర్భంగా ఏడో విడుత హరితహారంలో 10 వేల మొక్కలు నాటారు. రోడ్డుకిరువైపులా 10 కిలోమీటర్ల మేర మొక్కలు పెరుగుతుండగా వాటికి ట్రీగార్డులు వేసి, రోజూ పంచాయతీ ట్రాక్టర్తో నీటిని పోసి సంరక్షిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పకప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎండిన మొక్కల స్థానంలో కొత్తవి నాటి పచ్చదనం పెంచుతున్నారు. ప్రస్తుతం మొక్కలన్నీ చిగురు వేయగా రానున్న రెండేండ్లలో రహదారి మొత్తం పచ్చగా కళకళలాడుతుందని వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆధ్యాత్మికం.. ఆహ్లాదం
మోటకొండూర్ మండల కేంద్రంలోని రామలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో మాలధారులు యేటా పలు రకాల మొక్కలు అవి ఏపుగా పెరిగి భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పలు రకాల పూల మొక్కలు, తులసి, దానిమ్మ సైతం నాటడంతో పూలు, పండ్లు పూజకు అవసరం అవుతున్నాయని పూజారి తెలిపారు.
మార్కెట్లో పచ్చని తోట
సూర్యాపేట అర్బన్ : హరితహారం కార్యక్రమంతో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ పచ్చని చెట్లతో కళకళలాడుతున్నది. మార్కెట్లో నాటిన వివిధ రకాల మొక్కలు పెరిగి పచ్చదనం పంచుతున్నాయి. రైతులు, హమాలీలు చెట్ల నీడన సేదదీరుతున్నారు. అక్కడికొచ్చే వారికి ఆహ్లాద వాతావరణాన్ని అందిస్తున్నాయి. మార్కెట్ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్, మార్కెట్ కార్యదర్శి ఫసియొద్దీన్ ప్రత్యేక చొరవతో కదంబ వనాన్ని ఏర్పాటు చేసి పరిరక్షిస్తున్నారు. మార్కెట్లోని దుర్గామాత ఆలయ ప్రాంగణంలో హరితహారంలో నాటిన పండ్ల మొక్కలు పెరిగి ఫలాలు అందిస్తున్నాయి.
హరిత లోగిలి
గుర్రంపోడు : మండలంలోని పాల్వాయి గ్రామం హరితవనంగా మారింది. అందమైన పూలు, నీడనిచ్చే మొక్కలను నాటడంతో ప్రజలకు ఆహ్లాద వాతావరణాన్ని అందిస్తున్నాయి. గ్రామంలోని రైతువేదిక, పంచాయతీ కార్యాలయం, పల్లె ప్రకృతి వనాలతోపాటు, రహదారికి ఇరువైపులా సుమారు 10 వేల మొక్కలను నాటారు. వాటికి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ సంరక్షించడంతో ఏపుగా పెరిగి పచ్చదనం పంచుతున్నాయి.
స్వాగత తోరణం..
కట్టంగూర్ : మండలంలోని కురుమర్తి గ్రామ శివారులో రోడ్డుకు ఇరువైపులా ఆరేండ్ల కిందట నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. రహదారి పొడవునా పచ్చని చెట్లు తోరణంలా మారి ప్రయాణికులకు ఆహ్లాదం పంచుతున్నాయి. చెట్ల నీడన సేదతీరుతూ స్థానికులు, వ్యవసాయ కూలీలు ఉపశమనం పొందుతున్నారు.
మొక్కల సంరక్షణకు చర్యలు
సూర్యాపేట – జనగాం రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. పశువుల బారిన పడకుండా ట్రీగార్డులు ఏర్పాటు చేశాం. మొక్కలు ఎండిపోకుండా నీళ్లు పోయిస్తున్నాం. ప్రతిరోజూ రహదారిని పర్యవేక్షిస్తున్నాం.