సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 22 : అన్నింటా తానై ఎన్నో అవరోధాలను ఛేదించుకుంటూ మహిళా లోకం ముందుకు సాగుతున్నది. పోటీ ప్రపంచంలో మగ వారికి తీసిపోమంటూ అడుగులు వేస్తూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. విద్యుత్ స్తంభాలు, టవర్లు ఎక్కే జూనియర్ లైన్మెన్ ఉద్యోగం మగవారికే సాధ్యమనే అభిప్రాయాన్ని తలకిందులు చేస్తూ సంస్థాన్ నారాయణపురం మండలంలోని జనగాం గ్రామానికి చెందిన గడ్డం శ్రావణి తన మొదటి ప్రయత్నంలోనే జూనియర్ లైన్ఉమెన్ ఉద్యోగానికి ఎంపికైంది. కాన్పు అయిన మూడు నెలలకే హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి అందరితో శభాష్ అనిపించుకుంది. భర్త గడ్డం మహేశ్ కూడా జూనియర్ లైన్మెన్ ఉద్యోగం చేస్తున్నారు. భర్తతో పాటు జూనియర్ లైన్ఉమెన్గా ఉద్యోగం చేయడం సంతోషంగా ఉన్నదని చెప్తున్నది శ్రావణి.
నాన్న కోరిక నెరవేర్చాలని..
శ్రావణి తాత, తండ్రి కూడా విద్యుత్ శాఖలో ఉద్యోగులు. సబ్స్టేషన్లో ఆపరేటర్గా పని చేస్తున్న శ్రావణి తండ్రి.. కూతురిని కూడా విద్యుత్ శాఖలో ఉద్యోగిగా చూడాలని కలలు గన్నాడు. చిన్నప్పటి నుంచే తనతో పాటు విధులకు తీసుకెళ్లడం, ఇంట్లో చిన్న చిన్న కరెంటు పనులు, రిపేర్లు నేర్పించేవాడు. ఎప్పటికైనా తన బిడ్డను డిపార్ట్మెంట్లోకి తీసుకొస్తానని సహచరులతో చెప్పేవాడు. ఈ నేపథ్యంలో 2018లో శ్రావణి జేఎల్ఎం పరీక్షరాసింది. కోర్టు కేసుల వల్ల ఫలితాలు ఆలస్యం కావడంతో 2020లో పెళ్లి చేశారు. భర్త కూడా జూనియర్ లైన్మెన్గా ఉద్యోగం చేస్తున్నారు. భర్త ప్రోత్సాహంతో 3 నెలలు హైదరాబాద్లో హైటెన్షన్ విద్యుత్ టవర్లు ఎక్కడం కోసం కఠోర శిక్షణ తీసుకున్నది. బాబు పుట్టిన మూడు నెలల తరువాత టెస్టులో భాగంగా ఎత్తైనటువంటి 200కేవీ విద్యుత్ టవర్లు ఎక్కి ఉద్యోగానికి ఎంపికైంది.
నా భర్త ప్రోత్సాహంతోనే..
నా భర్త నన్ను చాలా ప్రోత్సహించేవారు. సలహాలు, సూచనలు, శిక్షణ ఇస్తూ వెన్ను తట్టేవారు. నా మహిళలు ఏ రంగంలోనూ తీసిపోరని ధైర్యాన్నిచ్చారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ రాణిస్తారని నిరూపించాలనుకున్నా. జూనియర్ లైన్ఉమెన్గా ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది.