‘ప్రస్తుతం విడుదలవుతున్న చాలా సినిమాలకు సరైన వసూళ్లు రావడం లేదు. థియేటర్స్ నిండటమే కష్టమవుతోంది. ప్రేక్షకులు డిజిటల్ ప్లాట్ఫామ్స్కు అలవాటుపడిపోయి థియేటర్స్కు రావడం లేదా? కొవిడ్ భయాలు కారణమా అనేది అర్థంకావడం లేదు’ అని అన్నారు నిర్మాత సురేష్బాబు. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘దృశ్యం-2’. ఇటీవల అమెజాన్ప్రైమ్ ద్వారా విడుదలైంది. శనివారం హైదరాబాద్లో సురేష్బాబు మాట్లాడుతూ ‘ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి చక్కటి స్పందన లభిస్తుంది. ‘దృశ్యం-2’ లాంటి కథాబలమున్న సినిమాల్ని థియేటర్స్లో విడుదలచేస్తే ప్రశంసలొస్తాయి కానీ వసూళ్లు ఎలా ఉంటాయనేది ఎవరూ చెప్పలేరు. ఓటీటీ అయితేనే సేఫ్ అనిపించింది. ఏపీలో ఉన్న టికెట్ రేట్స్ సమస్య కూడా మేము ఓటీటీని ఎంచుకోవడానికి ఓ కారణంగా నిలిచింది. చిత్ర పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య సరైన సమన్వయం లేకపోవడం, సమాచార లోపం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాము సృష్టించిన ఓ ప్రొడక్ట్ను ఏ రేటుకు అమ్మితే లాభసాటిగా ఉంటుందో నిర్ణయించే హక్కు తమకుందని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో టికెట్ రేట్స్ను తక్కువగా ఉంచడం వల్ల సామాన్యులకు చవకగా వినోదాన్ని అందించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే దానిపై అందరూ ఆలోచించుకోవాలి. ఇండస్ట్రీ వైపు నుంచి ఈ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని తెలిపారు.