మహబూబ్నగర్ : తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేయడంలో సురవరం ప్రతాపరెడ్డి (Suravaram Pratap reddy) అందించిన సేవలు అమోఘమని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Former Minister Srinivas Goud) అన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఆయన విగ్రహానికి సురవరం ప్రతాపరెడ్డి కుటుంబ సభ్యులు సురవరం కపిల్, నివేదితతో కలిసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురవరం ఒక వర్గానికి, ప్రాంతానికి పరిమితమైన వారు కాదని అన్నారు. ఆయన జీవిత చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ( Telangana) లో కవులే లేరని చెప్పిన రోజున 350 మందికి పైగా కవులతో గోల్కొండ కవుల సంచికను ప్రచురించి విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చారని అన్నారు.
తెలంగాణ సాహిత్యానికి జాతీయ స్థాయిలో సురవరం గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైతు సమితి డైరెక్టర్ మల్లు నర్సింహా రెడ్డి, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, కౌన్సిలర్లు గణేష్, అనంత రెడ్డి, పటేల్ ప్రవీణ్, రామలక్ష్మణ్ , సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.