రవీంద్రభారతి, నవంబర్ 25: తెలంగాణ వైతాళికుడు, సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డి సేవలు చిరస్మరణీయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, అభినయ హైదరాబాద్ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో 15వ అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ -2021ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీనివాస్గౌడ్, మామిడి హరికృష్ణ, సంగీత నాటక అకాడమీ సెక్రటరీ జి.వసుంధర పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సురవరం సాహితీ రంగంలో అనేక పుస్తకాలు రాసి తెలంగాణ కవులకు, కళాకారులకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన పేరుమీద ఓ సినిమా తీయాలన్నారు. అనంతరం బీఎన్రెడ్డి దర్శకత్వం వహించిన సురవరం ప్రతాపరెడ్డి జీవిత కథను కళాకారులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో నాటక రచయిత డి.విజయభాస్కర్, సురవరం కుటుంబీలు కృష్ణమోహన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.