న్యూఢిల్లీ, అక్టోబర్ 27: కేంద్ర ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్తో దేశ ప్రజలపై చట్టవిరుద్ధంగా నిఘా పెట్టిందన్న ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సైబర్ నిపుణులతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. దేశ భద్రత సాకుతో పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తే కోర్టు ప్రేక్షకుడిలా ఉండబోదని స్పష్టం చేసింది. ‘ప్రభుత్వం దేశ భద్రత సాకును చూపించి తనపై వచ్చిన ఆరోపణల నుంచి ప్రతీసారి తప్పించుకోలేదు. ఏదైనా అంశంపై దేశ భద్రత ముద్ర వేసినంత మాత్రాన అది న్యాయవ్యవస్థ పరిధిలోకి రాదని అనుకోకూడదు. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో జోక్యంపై న్యాయ వ్యవస్థ కూడా అప్రమత్తంగానే ఉంది. అలాగని ఆ ముద్ర వేసిన అన్నింటినీ గంపగుత్తగా న్యాయ సమీక్ష పరిధి నుంచి నిషేధించలేం’ అని స్పష్టం చేసింది. గోప్యత హక్కుకు భంగం కలగకుండా ప్రతీ ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ‘పెగాసస్ వ్యవహారంపై మేమే కమిటీని నియమించి దర్యాప్తు జరిపిస్తామ’న్న కేంద్రం అభ్యర్థనను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇందుకు అనుమతిస్తే ఇప్పటి వరకు పాటిస్తున్న న్యాయ సూత్రాలను ఉల్లంఘించినట్టు, పక్షపాతంతో వ్యవహరించినట్టు అవుతుందని వ్యాఖ్యానించింది. ఆరోపణలు వచ్చింది కేంద్ర ప్రభుత్వం పైనే కాబట్టి దర్యాప్తు అధికారం కేంద్రానికే ఇవ్వలేమని తెలిపింది. స్వతంత్ర కమిటీని నియమిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. సాధ్యమైనంత వేగంగా ఈ కమిటీ తన నివేదికను కోర్టుకు సమర్పించాలని కోరింది. విచారణను 8 వారాల పాటు వాయిదా వేసింది.
న్యాయం చేయడమే కాదు.. అందేలా చూడాలి
పెగాసస్ ఆరోపణలపై తామే కమిటీని నియమిస్తామని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ను సమర్పించింది. దీన్ని కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో ఇప్పటివరకు కేంద్రం వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పెగాసస్పై అఫిడవిట్ అవసరం లేదని ఒకసారి, దేశ భద్రత అంశాల వల్ల వివరాలు చెప్పబోమని మరోసారి, అఫిడవిట్ ఇస్తాం కానీ సవివరంగా ఇవ్వలేమని ఇంకోసారి.. ఇలా కేంద్రం పలుమార్లు వాదించిన విషయాన్ని గుర్తు చేసింది. ‘పెగాసస్తో నిఘా, ఇందులో విదేశీ సంస్థల ప్రమేయం ఉండటంపై దేశమంతటా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. కేంద్రానికి నోటీసులు జారీ చేశాం. వారు తీసుకొన్న చర్యలేంటో చెప్పలేదు. పెగాసస్ వాడారా.. లేదా.. అన్న దానిపై కచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. దేశ భద్రత సాకుతో నిరాకరించారు. ఇక్కడ ఆరోపణలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సంబంధించినవి. ఇవి ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిస్తాయి’ అని వ్యాఖ్యానించింది. పెగాసస్ వ్యవహారంలో తమ వైఖరి ఏమిటన్న దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వనుందువల్ల, తప్పనిసరి పరిస్థితుల్లోనే స్వతంత్ర కమిటీని నియమించాల్సి వస్తున్నదని పేర్కొన్నది. ‘న్యాయం చేయడమే కాదు. న్యాయం అందేలా కూడా చూడాలి’ అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
స్వతంత్ర కమిటీ నియమాకంపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘విరుద్ధ భావాలు గల ఈ ప్రపంచంలో నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, సమర్థంగా వ్యవహరించే నిపుణులను ఎంపిక చేయడం చాలా కష్టమైన వ్యవహారం’ అని పేర్కొన్నది. దేశంలో రాజ్యాంగ ఆశయాలు, చట్టబద్ధ పాలనను నిలబెట్టడానికే స్వతంత్ర కమిటీని నియమిస్తున్నట్టు తెలిపింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్వీ రవీంద్రన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని, ఆయనకు మాజీ ఐపీఎస్ అధికారి అలోక్ జోషి, సందీప్ ఒబెరాయ్ సహకరిస్తారని పేర్కొన్నది. దర్యాప్తునకు ముగ్గురు సైబర్ నిపుణులు.. నవీన్ కుమార్, ప్రభాహరణ్, అశ్విన్ అనిల్ను నియమించింది.
సమగ్ర తీర్పు
పెగాసస్ వ్యవహారంలో భావ ప్రకటన స్వేచ్ఛ, గోప్యతా హక్కులపై సుప్రీం కోర్టు సమగ్రమైన తీర్పు వెలు వరించిందని న్యాయ నిపుణులు పేర్కొ న్నారు. ఇవే అంశాలపై గతంలో ఫ్రెంచ్ కోర్టు ఇచ్చిన తీర్పు వ్యక్తిగత గోప్యతకే పరిమితమైనది. అమెరికా కోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా ఇంత సమగ్రంగా లేవని వారు విశ్లేషించారు.
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులపై పెగాసస్ స్పైవేర్తో నిఘా పెడుతున్నాయని గ్లోబల్ మీడియా సంస్థల కన్సార్షియం ప్రకటించింది. భారత్లో 300కు పైగా మందిపై నిఘా ఉందని పలువురి పేర్లను వెల్లడించింది. ఈ నేపథ్యంలో జర్నలిస్టులపై నిఘాను ఖండిస్తూ ఎడిటర్స్ గిల్డ్, తమ ఫోన్లను హ్యాక్ చేశారని ప్రము ఖ జర్నలిస్టులు రామ్, శశికుమార్, ఈ వ్యవహారంలో దర్యాప్తు కోరుతూ అడ్వొకేట్ ఎంఎల్ శర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇదే వ్యవహారంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.