Supreme Court | న్యూఢిల్లీ, జనవరి 27: ప్రస్తుతం ఉన్న వరకట్న, గృహ హింస చట్టాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఆయా చట్టాలను సమీక్షించి, సంస్కరించేందుకు ఒక నిపుణుల కమిటీని నియమించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని అనుమతించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. సమాజం మారాలని, ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. న్యాయవాది విశాల్ తివారీ దాఖలు చేసిన పిల్ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరిస్తూ, ‘సమాజంలో మార్పు రావాల్సిందే ఈ విషయంలో మేము ఏమీ చేయలేము. ఇందుకు తగ్గ పార్లమెంటరీ చట్టాలు ఉన్నాయి’ అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. ఇటీవల బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన నేపథ్యంలో దుర్వినియోగం అవుతున్న గృహహింస చట్టాలలో పిటిషన్దారు సంస్కరణలను కోరారు.
పెండ్లి సమయంలో ఇచ్చే బహుమతులు, వస్తువులు, నగదుకు సంబంధించిన జాబితాను తయారుచేసి వాటిని అఫిడవిట్ రూపంలో రికార్డు చేసి వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తో జత చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా పిటిషనర్ కోరారు. వరకట్న నిషేధ చట్టం, ఐపీసీలోని 498ఎ సెక్షన్ వరకట్న కోరికలు, వేధింపుల నుంచి వివాహిత మహిళకు రక్షణ కల్పిస్తాయి. అయితే ఈ చట్టాలు భార్యభర్తల మధ్య వేరే విషయంలో మనస్పర్థలు తలెత్తినపుడు భర్త కుటుంబంపై కక్షసాధించేందుకు ఈ చట్టాలను ఆయుధంగా మలచుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ చట్టాల కింద పళ్లైన మగవారిపై కొన్నిసార్లు తప్పుడు కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. వరకట్నం కేసుల్లో చాలా మంది పురుషులపై తప్పుడు అభియోగాలు నమోదవుతున్నాయని, ఇవి విషాదాంత పరిస్థితులకు దారి తీస్తున్నాయని పిటిషనర్ తెలిపారు. ఇది మన న్యాయ, క్రిమినల్ దర్యాప్తు విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని ఆయన తెలిపారు. వరకట్నం, గృహ హింస చట్టాల దుర్వినియోగం కారణంగా ఆ చట్టాలను రూపొందించడం వెనుక గల గొప్ప ఉద్దేశాలు ఓడిపోతున్నాయని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు.