న్యూఢిల్లీ: తమిళనాడులోని కల్లకురుచ్చిలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రెండవ అటాప్సీ రిపోర్ట్ను రిలీజ్ చేయకూడదని ఆ విద్యార్థిని తండ్రి పెట్టుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రెండవసారి పోస్టుమార్టమ్ నిర్వహించాలని సోమవారం మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ డాక్టర్ల ప్యానెల్లో తాము సూచించిన డాక్టర్ ఉండాలని ఆ విద్యార్థిని తండ్రి సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసును బుధవారం విచారించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. స్కూల్ విద్యార్థిని ఆత్మహత్య నేపథ్యంలో కల్లకురుచ్చిలో భారీ హింస చోటుచేసుకున్నది. వందల సంఖ్యలో స్కూల్ బస్సులకు నిప్పుపెట్టారు. క్లాస్రూమ్ ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. రాష్ట్రంలో భారీ హింస చెలరేగుతోందని, ఇవాళ రీపోస్టుమార్టమ్ జరుగుతోందని, ఆ పోస్టుమార్టమ్పై స్టే ఇవ్వాలని అమ్మాయి తండ్రి అభ్యర్థించారు. దీనికి జస్టిస్ ఎన్వీ రమణ సమాధానం ఇస్తూ ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉందని, హైకోర్టును నమ్మలేరా అని ఆయన ప్రశ్నించారు. పదేపదే లాయర్ అభ్యర్థనలు చేయగా.. సుప్రీంకోర్టు వాటిని తిరస్కరించింది.