న్యూఢిల్లీ: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్-GATE)-2022 పరీక్ష యధాతథంగా జరగనుంది. పరీక్షను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కరోనా వల్ల పరీక్ష వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ను కొట్టివేసింది. 48 గంటల ముందు పరీక్ష నిలిపివేత సరికాదని వెల్లడించింది. పరీక్ష నిలిపివేస్తే అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతారని తెలిపింది. దీంతో గేట్-2022 నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో గేట్ పరీక్ష జరగనున్నది.
పరీక్ష విద్యార్థులు సన్నద్ధమయ్యారని, పరీక్షను వాయిదావేసి విద్యార్థుల జీవితాలతో సుప్రీంకోర్టు ఆటలాడుకోదని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. సుమారు 20 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షను వాయిదా వేయాలని ఆన్లైన్లో పిటీషన్ దాఖలు చేశారని, అయితే తొమ్మిది లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని వ్యాఖ్యానించింది. పరీక్షకు 48 గంటల ముందు నిలిపివేయడం సరికాదని వెల్లడించింది.
ఈ ఏడాది గేట్ పరీక్షను ఖరగ్పూర్ నిర్వహిస్తున్నది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఇప్పటికే విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2 వందలకుపైగా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష రెండు విడతల్లో జరుగుతుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ జరగనున్నది.