తిరుపతి : తీవ్ర కష్టాల్లో ఉన్న ఏపీ డిస్కంలకు కేంద్రం ఆదుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆదివారం తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రారంభోపాన్యాసం చేసిన జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నిరెండుగా విభజించడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని వివరించారు. రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా విభజన హామీలు అమలు కావడంలేదని, సమస్యలన్నీ పెండింగ్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
రీసోర్స్ గ్యాప్నూ భర్తీచేయలేదని, ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదని, పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన వివరించారు. గత ప్రభుత్వంలో పరిమితి దాటారని రుణాలపై ఇప్పుడు కోత విధిస్తున్నారని దీనిపై వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని జగన్ కోరారు.రాష్ట్రాల్లో రేషన్ లబ్ధిదారుల గుర్తింపుకోసం కేంద్ర ప్రభుత్వ ప్రక్రియలో హేతుబద్ధత లేదని, వెంటనే సవరణలుచేయాలని సూచించారు.