బాలాసోర్, జనవరి 20: సూపర్సానిక్ క్రూజ్ మిసైల్ బ్రహ్మోస్ను భారత్ మరోసారి పరీక్షించింది. ఈ క్షిపణి వ్యవస్థలో సాంకేతికతను, నియంత్రణ వ్యవస్థను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అప్గ్రేడ్ చేసిన నేపథ్యంలో ఈ పరీక్ష నిర్వహించారు. ఒడిశాలోని చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. నిర్దేశించిన అన్ని లక్ష్యాలను క్షిపణి ఛేదించిందని డీఆర్డీవో తెలిపింది. సాంకేతిక మార్పులతో క్షిపణి సామర్థ్యాన్ని పెంచారు. క్షిపణిని ఆధునీకరించిన నేపథ్యంలో పది రోజుల వ్యవధిలోనే బ్రహ్మోస్ను రెండు సార్లు పరీక్షించారు. మొదటి ప్రయోగం ఈ నెల 11న జరిగింది. బ్రహ్మోస్ ధ్వని కంటే మూడు రెట్ల వేగంతో దూసుకెళ్లి లక్ష్యాలను ఛేదిస్తుంది.