హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): నిరుపేదలకు అత్యాధునిక వైద్యసేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్కు నలువైపులా నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణ ప్రక్రియలో కీలక అడుగు పడింది. రూ.2,679 కోట్ల వ్యయంతో గడ్డిఅన్నారం పండ్లమార్కెట్, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, అల్వాల్ వద్ద నిర్మించబోయే ఈ దవాఖానల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఈ దవాఖానలకు సంబంధించి తాజాగా కాంట్రాక్టు సంస్థలకు ఆ శాఖ ఎల్వోఏ(లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్)ను అందజేసింది. త్వరలో పనులు ప్రారంభం కానుండగా, రెండేండ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు.
ప్రైవేటు దవాఖానలకు దీటుగా..
ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు నిజాం కాలం నాటి ఉస్మానియా, గాంధీ దవాఖానలు మినహా కొత్తగా ఒక్క దవాఖానను కూడా నిర్మించలేదు. రోజురోజుకు జనాభా పెరుగుతుండటం, అంతేస్థాయిలో వైద్య సేవలు అవసరం అవుతుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల ఆరోగ్యం కోసం మరిన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానలను అందుబాటులోకి తేవాలని సంకల్పించారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) పేరుతో గడ్డి అన్నారం, సనత్నగర్, అల్వాల్లలో ఏర్పాటు చేస్తున్న ఈ దవాఖానలకు శనివారం ప్రభుత్వం పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేసింది. గడ్డిఅన్నారం, సనత్నగర్ దవాఖానలు 1,000 పడకల చొప్పున, అల్వాల్ దవాఖాన 1,200 పడకల సామర్థ్యంతో నిర్మించనున్నారు. గత ఏప్రిల్లో ప్రభుత్వం రూ.2,679 కోట్లు మంజూరు చేయగా, జూన్లో రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం సీఎం కేసీఆర్ ఒకేరోజు మూడింటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సనత్నగర్ దవాఖాన 60 ఎకరాల విస్తీర్ణంలో 14 అంతస్తులు, గడ్డిఅన్నారం దవాఖాన 21.36 ఎకరాల్లో 14 అంతస్తులు, అల్వాల్ దవాఖాన 28.41 ఎకరాల్లో ఐదు అంతస్తుల్లో నిర్మించాలని నిర్ణయించారు.