హైదరాబాద్.. తాజా సీజన్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్నది. సమిష్టిగా సత్తాచాటుతున్న విలియమ్సన్ సేన వరుసగా నాలుగో మ్యాచ్లోనూ అదరగొట్టింది. బౌలింగ్ దళం మరోసారి విజృంభించగా.. టాపార్డర్ బాధ్యతాయుతమైన ఆటతో పంజాబ్ను చిత్తు చేసింది. వేలానికి ముందే అట్టిపెట్టుకున్న ఉమ్రాన్ బంతితో ఉగ్రరూపం కనబరిస్తే.. కోట్లు పెట్టికొనుగోలు చేసుకున్న అభిషేక్, పూరన్, మార్క్మ్ తమ రేటుకు న్యాయం చేశారు.
ముంబై: ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సన్రైజర్స్ ఐపీఎల్ 15వ సీజన్లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. లివింగ్స్టోన్ (33 బంతుల్లో 60; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్థ సెంచరీతో రాణించగా.. షారూక్ఖాన్ (26) ఫర్వాలేదనిపించాడు. గాయం కారణంగా కెప్టెన్ మయాంక్ ఈ మ్యాచ్కు దూరమవగా.. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్ స్టాండిన్ సారథిగా వ్యవహరించాడు. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 4, భువనేశ్వర్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన హైదరాబాద్ 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ (3) విఫలమవగా.. అభిషేక్ శర్మ (31), త్రిపాఠి (34), పూరన్ ( 35 నాటౌట్), మార్క్రమ్ (27 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్) తలా కొన్ని పరుగులతో జట్టుకు విజయాన్నందించారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు, రబడ ఓ వికెట్ తీశారు. ఈ విజయంతో రైజర్స్ 8 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఉమ్రాన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పంజాబ్ ధాటిగా ఆడేందుకు తీవ్రంగా ఇబ్బంది పడింది. మూడో ఓవర్లో స్టాండిన్ కెప్టెన్ ధవన్ (8)ను ఔట్ చేసిన భువనేశ్వర్ రైజర్స్కు శుభారంభాన్నివ్వగా.. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (14)ను నటరాజన్ వెనక్కి పంపాడు. ఫలితంగా ఐదు ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 33/2తో నిలిచింది. బెయిర్ స్టో (12), జితేశ్ (11) ఎక్కువసేపు నిలువలేకపోయినా.. లివింగ్స్టోన్ నిలకడగా పరుగులు రాబట్టాడు. జాన్సెన్ ఓవర్లో 4,4,6 కొట్టిన లివింగ్స్టోన్ ఉమ్రాన్ ఓవర్లో 4,6 అరుసుకున్నాడు. అతడికి షారుక్ కాస్త సహకరించడంతో పంజాబ్ మెరుగ్గానే కనిపించింది. అయితే గేర్ మార్చే సమయంలో వీరిద్దరినీ హైదరాబాద్ బౌలర్లు పెవిలియన్కు పంపగా.. ఆఖరి ఓవర్లో ఉమ్రాన్ రనౌట్ సహా నాలుగు వికెట్లు పడగొట్టి పంజాబ్ను ఆలౌట్ చేశాడు.
మెరుపు వేగంతో అభిమానులను అలరిస్తున్న ఉమ్రాన్ మాలిక్పై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ‘నమ్మశక్యం కాని స్పెల్ ఇది. బహుశా ఐపీఎల్లో ఇదే ఉత్తమ ఓవర్ కావొచ్చు. నా అభినందనలు అందుకో యువకుడా’అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
సీజన్ ఆరంభం నుంచి తన వేగంతో కట్టిపడేస్తున్న ఉమ్రాన్.. ఆఖరి ఓవర్లో నిప్పులు చెరిగాడు. సగటున గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులిలిసిరిన ఉమ్రాన్ను ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. చివరి ఓవర్ రెండో బంతికి ఓడెన్ స్మిత్ను రిటర్న్ క్యాచ్ ద్వారా వెనక్కి పంపిన మాలిక్.. నాలుగో బంతికి చాహర్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఉమ్రాన్ వేగానికి వికెట్ గాల్లో గింగిరాలు కొట్టిన విధానం చూసి తీరాల్సిందే. ఐదో బంతికి వైభవ్ బౌల్డ్ కాగా..
ఆఖరి బంతికి అర్శ్దీప్ రనౌటయ్యాడు.
4 ఐపీఎల్లో ఆఖరి (20వ) ఓవర్ను మెయిడెన్గా వేసిన నాలుగో బౌలర్గా ఉమ్రాన్ రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఇర్ఫాన్ పఠాన్ (2008 ముంబైపై), మలింగ (2009లో డెక్కన్ చార్జర్స్పై), ఉనాద్కట్ (2017 హైదరాబాద్పై) ఈ ఫీట్ నమోదు చేశారు.
పంజాబ్: 20 ఓవర్లలో 151 ఆలౌట్ (లివింగ్స్టోన్ 60, షారూక్ఖాన్ 26; ఉమ్రాన్ 4/28, భువనేశ్వర్ 3/22), హైదరాబాద్: 18.5 ఓవర్లలో 152/3 (మార్క్రమ్ 41*, పూరన్ 35*; చాహర్ 2/28).