ఇండోర్ : పండుగ సీజన్ సమీపిస్తుండగా చక్కెర ధరల పెరుగుదలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ మంత్రి కైలాస్ విజయ్వర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చక్కెర ధరలు చాలా ఎక్కువగా ఉండాలని, అలాగే 40 ఏండ్లు పైబడినవారు దీనిని మానేయాలని వ్యాఖ్యానించారు.
ఈరోజుల్లో 90 శాతం మంది ప్రజలు స్వీట్లను ఇష్టపడటం లేదని, తాను కూడా వాటిని తినడం పూర్తిగా మానేశానని ఆయన చెప్పారు. బుధవారం ఇండోర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఏది ఏమైనా చక్కెర ధరలు చాలా ఎక్కువగా ఉంటేనే మంచిదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో కేవలం పిల్లలకు మాత్రమే చక్కెర అందుబాటు ధరలో లభించాలి. వృద్ధులకు చక్కెర ఇవ్వకూడదు అని ఆయన అన్నారు.