హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ హైదరాబాద్లో ఓ భారీ డీల్ను విజయవంతంగా పూర్తిచేసింది. కూకట్పల్లిలో గోద్రేజ్ అండ్ బోయ్స్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీకి చెందిన 10 ఎకరాల స్థలాన్ని అశోకా బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్బీఎల్) రూ.235 కోట్లకు టోకుగా కొనుగోలు చేసింది. దేశంలో జరిగిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ డీల్స్లో ఇది ఒకటి. తమకున్న బలమైన మార్కెటింగ్ సంబంధాలతో ఈ డీల్ను రికార్డు సమయంలో పూర్తిచేయగలిగామని జేఎల్ఎల్ తెలంగాణ, ఏపీ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పట్నాయక్ తెలిపారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రికవరీకి ఈ ఏడాది మూడో త్రైమాసికంలో మంచి మద్దతు లభించిందని, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే విక్రయాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చాలా అధిక సంఖ్యలో జరిగాయని తెలిపారు. ఏఎస్బీఎల్ సీఈవో అజితేశ్ కొరుపోలు మాట్లాడుతూ.. కూకట్పల్లిలో కొనుగోలు చేసిన స్థలంలో ప్రాజెక్టును చేపట్టేందుకు రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్లో తమకు 10 లక్షల చదరపు అడుగుల రెసిడెన్షియల్ స్థలాలున్నాయని తెలిపారు. 2025 జూన్ నాటికి ప్రీమియం రెసిడెన్షియల్ డెవలప్మెంట్, గ్రేడ్-ఏ కమర్షియల్ స్పేస్తో కలిపి మిశ్రమ వినియోగ అభివృద్ధి విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్నామని చెప్పారు.
2022లోనూ అదే దూకుడు
వచ్చే ఏడాదిలోనూ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం భారీ వృద్ధిని నమోదు చేసుకోనున్నదని అంచనాలు వెలువడుతున్నాయి. 2022లో దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ పునరుద్దరణలో మూడు మెట్రో నగరాలు అత్యంత కీలకంగా మారనున్నాయని, వీటిలో హైదరాబాద్తోపాటు ముంబై, బెంగళూరులు ఉన్నాయని హౌసింగ్ డాట్కామ్ ఐరీస్ ఇండెక్స్లో వెల్లడించింది.